నిలువ నీడలేక.. ఏండ్లకేండ్లుగా కిరాయి ఇండ్లలో.. ఇరుకిరుకు గదుల్లో బతుకీడ్చిన నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో వారికి భరోసా దొరికింది. ఆత్మ గౌరవంతో బతుకుతామన్న ధీమా పెరిగింది. కొత్తపల్లి మండలం ఎలగందులలో 20, ఖాజీపూర్లో 20 చొప్పున మొత్తం 40 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఇండ్ల పట్టాలు అందజేయగా, లబ్ధిదారులు సంబురపడ్డారు. తాము జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.
– కొత్తపల్లి, జూన్ 25
సొంతిళ్లు కావాలని వారు సమైక్య రాష్ట్రంలో ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నా అవన్నీ బుట్టదాఖలయ్యాయి.. తమ ఊరికి వచ్చిన అధికారులకు తమకు గూడు కట్టించి ఇవ్వాలని గోడు వెల్లబోసుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన డబుల్ బెడ్రూం పథకంతో నిరుపేద, మధ్యతరగతి వర్గాల కల నెరవేరుతున్నది. శనివారం కొత్తపల్లి మండలం ఎలగందులలో 20, ఖాజీపూర్లో 20 చొప్పున మొత్తం 40 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రెండు గ్రామాల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి గృహప్రవేశాలు చేయించారు. లబ్ధిదారులకు పట్టాలు అందించారు. దాంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ కలను సాకారం చేసిన టీఆర్ఎస్ సర్కారును వేనోళ్లలా పొగిడారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
పైసా ఖర్చుపెట్టకుండానే ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది. తెలంగాణ రాక ముందు ఇంటి కోసం ఏండ్లకేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడిస్తం.. అప్పుడిస్తం అని తప్పించుకున్నరు. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన ఇంటిలో సౌలతులు మంచిగున్నయి. మా జీవితంల ఈరోజు మరిచిపోలేనిది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల సార్లకు రుణపడి ఉంటం.
– కటకం విజయ, లబ్ధిదారు, ఎలగందుల
ఇంతకాలం ఇల్లులేక మస్తు తిప్పలువడ్డం. కిరాయికట్టలేక అరిగోస పడ్డం. ఫస్ట్ తారీకు వచ్చిందంటే అద్దె కట్టుడెట్ల అని రందీపడేది. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఉచితంగా రెండు పడకల గదుల ఇంటిని నిర్మించి ఇచ్చింది. ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొడుకులు, మనుమలు, మనుమరాండ్లతో సంతోషంగా ఉంటం. సొంతింటి కలను తీర్చిన సీఎం కేసీఆర్ సారును మరువబోం.
– ఇల్లందుల భూదవ్వ, లబ్ధిదారురాలు (ఖాజీపూర్)
తెలంగాణ గవర్నమెంట్ భూమిలేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టి ఇస్తుందని తెలుసు. అయితే, మాకు ఇల్లు వస్తదని కలలోగూడా అనుకోలె. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడం సంతోషంగా ఉన్నది. సొంతింటి కలను తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
కే రాజేశ్వరి, లబ్ధిదారురాలు (ఎలగందుల)