పైసా ఖర్చులేకుండా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూంలు అందజేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. శనివారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. నగరంలో పలువురి దళితబంధు లబ్ధిదారుల యూనిట్లు, కార్ఖానాగడ్డ ఉన్నతపాఠశాలలో స్మార్ట్రూంను ప్రారంభించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్లో రెండు పడకల గదుల ఇండ్ల సముదాయాలు, ఎలగందులో మన ఊరు-మన బడిలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
కొత్తపల్లి, జూన్ 25 : పైసా ఖర్చులేకుండా పేదలకు ఇండ్లు నిర్మించి అందజేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పారు. దశలవారీగా అర్హులందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దన్నారు. శనివారం కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయాలకు ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఎక్కడాలేనివిధంగా సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నారని కొనియాడారు.
ఎలగందులలో 20, ఖాజీపూర్లో 20 డబుల్ బెడ్రూం గృహాలను నిరుపేదలకు అందించామని, మిగతా వారికి పట్టాలు అందించి ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తించి ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేశ్గౌడ్, సర్పంచులు ఎద్దండి షర్మిలా ప్రకాశ్, ఉల్లందుల రాజమ్మ, ఎంపీటీసీలు మంద రమేశ్గౌడ్, భూక్యా తిరుపతినాయక్, ఆర్డీవో ఆనంద్కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్, నాయకులు సోమినేని తిరుపతి, ఉల్లందుల రాజు తదితరులు పాల్గొన్నారు.