కార్పొరేషన్, జూన్ 25 : సర్కారు బడుల ఆధునీకరణకు నగరపాలక సంస్థ నడుంబిగించింది. విద్యార్థుల్లో మేథోశక్తి పెంచేందుకు నగరంలోని పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూంలను ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు గతంలోనే 52 స్కూళ్లను ఎంపిక చేసి, తాజాగా ప్రయోగాత్మకంగా కార్ఖానాగడ్డ బడిలో ఓ గదిని స్మార్ట్ క్లాస్ రూంగా మార్చగా, శనివారం మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
పిల్లలకు గూగుల్ క్రోమ్ బుక్స్, ల్యాప్ ట్యాప్లు యూపీఎస్లు, స్టూడెంట్ డెసులు అందజేశారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంచేందుకే కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఏజెన్సీ సహకారంతో స్మార్ట్ క్లాస్రూంలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆడియో, వీడియో ఫుటేజీల ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం, ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. ఇక్కడ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కార్పొరేటర్లు, డీఈఓ సీహెచ్వీఎస్ జనార్దన్రావు ఉన్నారు.