కార్పొరేషన్, జూన్ 25: నగరంలో డంప్యార్డు సమస్యను బయోమైనింగ్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. డంప్ యార్డ్లో సాగుతున్న బయోమైనింగ్ పద్ధతిని శనివారం ఆయన పరిశీలించారు. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజినీర్ విద్యార్థులు ప్రాజెక్ట్ స్టడీ టూర్లో భాగంగా డంప్ యార్డ్ను సందర్శించారు. బయోమైనింగ్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మేయర్ విద్యార్థులను ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులకు బయో మైనింగ్ ప్రాసెస్పై ప్రాజెక్ట్ స్టడీ టూర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డంప్యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయోమైనింగ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇండ్లల్లో ఉత్పత్తి అయ్యే తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి, పొడి చెత్తలో లభ్యమయ్యే వాటిని రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించవచ్చని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరూ ఇంట్లోనే చెత్తను వేరు చేసి అందిస్తే డంప్యార్డును నిర్మూలించవచ్చని తెలిపారు.
చెత్తను వేరు చేయకపోవడంతో వచ్చే సమస్యలను విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డంప్యార్డ్ను రూ.16 కోట్లతో బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్లో రాకుండా ఉండాలంటే ఉత్పత్తి అయ్యే చెత్తను రెడ్యూజ్, రీసైక్లింగ్, రీ యూజ్ పద్ధతిని అనుసరించాలన్నారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా తొలగించి స్థలాన్ని మానేరు రివర్ ఫ్రంట్కు ఉపయోగిస్తామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మరో స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం అకడికి వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు బయో మైనింగ్ ప్రాసెస్ చేస్తూ తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
డంప్యార్డ్ బయోమైనింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులను, ఏజెన్సీ కాంట్రాక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బయో మైనింగ్ ఈ ప్రక్రియలో ఏర్పాటు చేసిన మిషనరీ ప్లాంట్కు తోడు మరో ప్లాంటును త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా బయో మైనింగ్ ప్రక్రియను పూర్తి చేసి చెత్తను నిర్మూలించాలని ఆదేశించారు. 2 బయో మైనింగ్ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తూ తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ జంగిలి ఐలేందర్యాదవ్, బండారి వేణు, నాయకులు చల్ల హరిశంకర్, అధికారులు ఈఈ కిష్టప్ప, కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.