హుజూరాబాద్ టౌన్, జూన్ 25: దళితులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ధనికులు కావాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల సూచించారు. పట్టణంలోని 28వ వార్డులో శనివారం దళితబంధు లబ్ధిదారు శనిగరం శారద-రాముకు మంజూరైన రైస్ డిపోను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ప్రతి కుటుంబానికి రూ.పది లక్షలు ఆర్థిక సాయం అందజేస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. అర్హులందరూ దళిత బంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అతిథులు, వారిని లబ్ధిదారులు స్వీట్లు తినిపించి శాలువాలతో సత్కరించారు. వారి వెంట దళిత సంఘాల నాయకులు, పలువురు లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.