జగిత్యాల రూరల్, జూన్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. చల్గల్ గ్రామంలో దళిత బంధు లబ్ధిదారుడు తరాల వెంకటేశ్ ఏర్పాటు చేసుకున్న శ్రీ వినాయక మెడికల్ ఏజెన్సీని శనివారం జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారుడికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు ఎల్ల గంగనర్సు రాజన్న, చెరుకు జాన్, తిరుపతి, ఉప సర్పంచ్ పద్మ-తిరుపతి నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకూ నీరందించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే సంజయ్, ఎస్సారెస్పీ ఈఈ సుధాకర్ రెడ్డి, డీఈతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు ప్రాంతాలు కతాపూర్, ధావన్పల్లి, చింతలూరు, మంగెల, కమ్మునూరు, గుట్రాజ్ పల్లి, బట్టపల్లి, పొతారం గ్రామాలకు నీరు అందించడమే లక్ష్యంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాంలు, కాల్వలు, రోళ్లవాగు ప్రాజెక్ట్ వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయికల్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. రాయికల్ మాదిగ కుంట అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. వరద కాల్వ నుంచి అంతర్గాం చెరువుకు వేసిన పైప్ లైన్ పనుల గురించి, రాంపూర్ పంప్హౌస్ దగ్గర 0.5 టీఎంసీ నీళ్లు వదిలి గేట్లు ఎత్తడం వల్ల అంతర్గాం చెరువును నింపే అవకాశం ఉంటుందని తెలిపారు.