కార్పొరేషన్, జూన్ 25: రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దళిత బంధు పథకంతో దళితులకు బతుకుబాట చూపారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. శనివారం నగరంలోని 3వ డివిజన్, 25, 26, 19వ డివిజన్లల్లో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేదర్, జగ్జీవన్రామ్, జ్యోతిభాపూలే కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వాలు మారినా దళితుల తల రాత మారలేదని, గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని విమర్శించారు. దళితులకు ఆర్థిక సాయం చేసేందుకు గత ప్రభుత్వాలు అనేక నిబంధనలు విధిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఆదుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మానవతకు మారుపేరని, దళితబంధు పథకాన్ని ఎవరూ అడుగకున్నా, గొప్పమనసుతో అమలు చేస్తున్నారని కొనియాడారు.
కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, ఇప్పటి వరకు 250 మందికి యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్ల పనితీరును నిత్యం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకంలో ఎక్కడా అవకతవకలు, అవినీతికి తావులేకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంజూరైన వంద యూనిట్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే సోమవారం దళితబందుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి వేగంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం విషయంలో తాము ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, నక్క పద్మ, ఎడ్ల సరిత అశోక్, ఎదుర్ల రాజశేఖర్, బండారి వేణు, తోట రాములు, సుధగోని మాధవి, కుర్ర తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు అర్ష మల్లేశం, చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్ గౌడ్ ఉన్నారు.