విద్యానగర్, జూన్ 25: వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన హరితహారం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, క్రీడా ప్రాంగణాలకు స్థలాల గుర్తింపు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారంలో నాటిన మొకలు వంగిపోకుండా ఊతకర్రలు కట్టి, ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నర్సరీల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి, మొకలు నాటాలన్నారు. మండలాల్లో ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, చెరువు గట్లపై మొకలు నాటాలన్నారు.
మండల సమాఖ్యలో మహిళా సంఘాలకు, ఉపాధి హామీలో పని చేసే వారిని సమన్వయం చేసుకొని గూగుల్ పేకు బదులు ఇండియన్ పోస్ట్ భారత్ పే (ఐపీబీపీ) యాప్ను డౌన్ లోడ్ చేయించి వారితో ఖాతాలు తీయించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్లాల్, ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీపీవో కొమురయ్య తదితరులు ఉన్నారు.