పిల్లల ప్రాథమిక విద్యకు అంగన్వాడీ కేంద్రం.. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక, ఉన్నత విద్య కోసం జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలు.. ఇంకా డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకేసారి కూర్చొని తినేలా డైనింగ్ హాల్, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానం.. క్రీడల కోసం క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులు, అథ్లెటిక్స్ ట్రాక్తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ ప్లే మైదానం.. ఇలా ఒక్కటేమిటి సకల వసతులతో గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారంతో ‘మన ఊరు- మన బడి’ కింద ఆరెకరాల స్థలంలో 3కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్నది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– గంభీరావుపేట, జూన్ 23
పేదలందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర సర్కారు విశేష కృషి చేస్తున్నది. ఉన్నచోటే కేజీ టూ పీజీ విద్యనందించేందుకు ప్రణాళికలు వేసి, ‘మన ఊరు – మన బడి’ కింద విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నది. అందులో భాగంగా మారుమూల గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో కేజీ టూ పీజీ క్యాంపస్ రూపుదిద్దుకున్నది.
మండల కేంద్రంలోని ఆరెకరాల విస్తీర్ణంలో కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధమవుతున్నాయి.
అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వసతులతో వంట గదితో పాటు సామగ్రిని నిల్వ చేసేందుకు ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. 50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రం సిద్ధం చేస్తున్నారు.
అంతర్జాతీయ వసతులతో 4500 చదరపు అడుగుల్లో క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు.45వేల చదరపు అడుగులలో క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ ప్లే మైదానంగా తీర్చిదిద్దుతున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన మాట మేరకు గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, రహేజా కార్ప్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఊర్దూ మీడియంలో విద్యా బోధన అందించనున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు సిద్ధం చేస్తున్నారు. వీటిని త్వరలోనే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నది.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్