ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికీకరణ పరుగందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం కింద పరిశ్రమల స్థాపన జోరందుకున్నది. నాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న అవరోధాలను తొలగించి.. అనుమతులన్నింటినీ 30 రోజుల్లోనే ఇచ్చేలా తెచ్చిన ‘టీఎస్ ఐపాస్’ సత్ఫలితాలనిస్తున్నది. ఒక వైపు పర్మిషన్లను సులభతరం చేయడం.. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన, 24 గంటల కరెంటు సరఫరా, ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.
ఇప్పటికే 18వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టి.. 2,988 పరిశ్రమలను నెలకొల్పారు. జనవరి నుంచి మే నెలాఖరు వరకు కొత్తగా 200 ఇండస్ట్రీలు రాగా, ఈ యేడాది చివరి వరకు మరో 800 వరకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతుండగా.. మరింత ప్రగతిని సాధించేందుకు ప్రోత్సహిస్తున్నారు.
కరీంనగర్ జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిశ్రమల స్థాపనకు నాటి సమైక్య రాష్ట్రంలోఎదురైన ఇబ్బందులు స్వరాష్ట్రంలో ఉండొద్దన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అందులో భాగంగా ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఉన్న అవాంతరాలు, అవరోధాలను తొలగిస్తున్నది.
పరిపాలన అనుమతులన్నీ కేవలం 30 రోజుల్లోనే కల్పించేలా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వయం ధ్రువీకరణ వ్యవస్థ (టీఎస్ఐపాస్)ను 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ విధానం కింద వందశాతం కరప్షన్ ఫ్రీతో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అందులో 23 విభాగాలకు సంబంధించి దాదాపు 40 రకాల పర్మిషన్లను ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటన్నింటికి కేవలం నెల గడువు మాత్రమే పెట్టారు.
ఔత్సాహిక పారిశ్రామికులు ఒక పరిశ్రమను నెలకొల్పేందుకు అనువైన ధ్రువపత్రాలతో పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 30 రోజుల్లో సంబంధిత శాఖల అనుమతులన్నీ సదరు యజమానులకు వచ్చేలా టీఎస్ఐపాస్ కింద చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ఔత్సాహిక పారిశ్రామికులు ఆయా విభాగాలకు తిరగాల్సిన అవసరం లేకుండా పకడ్బందీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అనుమతుల జారీ విషయంలో గడువు దాటితే దానికి బాధ్యులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా టీఎస్ఐపాస్లో నిబంధన
పొందుపరిచారు.
టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మరోపక్క మౌలిక సదుపాయల కల్పనతోపాటు పరిశ్రమలు సజావుగా నడిచేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తల పురోగతి పథకం (టీ-ఐడియా)ను అమల్లోకి తెచ్చింది. తద్వారా పరిశ్రమలకు పలురకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నది. స్టాంప్ డ్యూటీ, విద్యుత్, వడ్డీ, పెట్టుబడి రాయితీ, మూలధన సాయం ఇలాంటి ఎన్నో సేవలను కల్పిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో చూస్తే.. 2014-15 నుంచి అందించిన రాయితీలు 47.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని తరహాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అన్న తేడా లేకుండా 24 గంటల కరెంటు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. నాటి సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడే వల్ల వేసవిలో వారానికి మూడు నాలుగు రోజుల పాటు పరిశ్రమలు మూత పడేవి. జనరేటర్లు అమర్చుకున్నా డీజిల్ ఖర్చులు భరించలేక పారిశ్రామికులు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రాత్రీ పగలు అన్న తేడా లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నది. దాంతో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచేందుకు మక్కువ చూపడం కనిపిస్తున్నది.
ఒక వైపు అనుమతులను సులభతరం చేయడం.. మరోవైపు 24 గంటల కరెంటు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రభుత్వం ఇస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమకు అనువైన జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. టీఎస్ ఐపాస్ అమల్లోకి వచ్చిన తదుపరి ఉమ్మడి జిల్లాలో 2,998 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అందుకోసం 18,328 కోట్లు పెట్టుబడి పెట్టారు. వీటి ద్వారా 30,545 మందికి ఉపాధి కల్పించారు. వీటితోపాటు 2022 జనవరి నుంచి గత మే 31 వరకు మరో 200 పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా 1500 మందికి ఉపాధి లభ్యమైంది. ఈ యేడాది చివరి నాటికి మరో 800 పరిశ్రమలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పరిశ్రమల ఏర్పాటును మరింత ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా వివిధ ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు కావాల్సిన చర్యలను చేపట్టారు.