సాగునీటి స్వప్నం నెరవేరింది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత చొరవతో ఏండ్లనాటి సమస్యకు పరిష్కారం దొరికింది. వేసవి వచ్చిందంటే చాలు ఏండ్లుగా చుక్క నీరు లేక నెర్రెలు బారిన రాయికల్ చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. రూ.25 లక్షల వ్యయంతో ఎస్సారెస్పీ కాలువకు తూము నిర్మించి తటాకానికి అనుసంధానించడంతో పునర్జీవం పోసుకున్నది. మూడేళ్లుగా పుష్కలమైన జలాలతో ఐదు గ్రామాల రైతులు, ప్రజల సాగు, తాగునీటికి భరోసా ఇస్తున్నది. ఇంకా రూ.40 లక్షల వ్యయంతో నాలుగు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలకు నీరందుతుండగా, ఆయకట్టు కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాయికల్ రూరల్, జూన్ 23: మండలంలోని రాయికల్తో పాటు మైతాపూర్, చెర్లకొండాపూర్, కొత్తపేట్, మూటపెల్లి గ్రామాల సాగు, తాగు నీటికి రాయికల్ చెరువే ఆధారం. ఒక్కసారి నిండితే చెరువు కింద 700 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకూ నీరందించేది. 250 ఎకరాల్లో విస్తరించిన కాలక్రమేణా ఆనవాళ్లు కోల్పోయింది. కేవలం వర్షాకాలంలో మాత్రమే నీటితో కళకళలాడేది. వేసవి వచ్చిందంటే చాలు నెర్రెలు బారి కనిపించేది. దీంతో ఆయకట్టు రైతులు కేవలం ఏడాదిలో ఒక్క పంట వానకాలంలో మాత్రమే సాగు చేయాల్సిన పరిస్థితి ఉండేది.
రాయికల్ చెరువు కింది ఐదు గ్రామాల ప్రజలు సాగు, తాగు నీటికి ఏండ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో 2019లో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితకు పరిస్థితిని వివరించడంతో ఆమె స్పందించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మేడిపల్లి మండలం తొంబర్రావుపేట వద్ద ఎస్సారెస్పీ డీ-52 కెనాల్కు చెరువును అనుసంధానించాలని నిర్ణయించారు. రూ.25లక్షల వ్యయంతో తూము నిర్మించి చెరువుకు జీవం పోశారు. దీంతో చెరువు నిండుకుండలా మారింది. మూడేళ్లుగా ఆఆయకట్టు రైతుల, సమీప గ్రామాల ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తున్నది.
ఎస్సారెస్పీ నుంచి నీరు వదిలిన క్రమంలో రాయికల్ చెరువులోకి నీరు వచ్చేలా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట వద్ద 25 క్యూసెక్కుల నీరు వచ్చేలా తూము నిర్మించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ తూము ద్వారా మొదట మేడిపెల్లి మండలం పోరుమల్ల చెరువుకు నీరు చేరుతుంది. తర్వాత అక్కడి నుంచి మైతాపూర్ వాగు ద్వారా రాయికల్ పెద్ద చెరువులోకి నీరు వస్తుంది. ఇక్కడ నిండిన తర్వాత మత్తడి ద్వారా మూటపెల్లి, కొత్తపేట్ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరందుతుంది.
పోరుమల్ల చెరువు మత్తడి నుంచి రాయికల్ పెద్ద చెరువు దాకా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐదు కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండేందుకు రూ.40 లక్షల వ్యయంతో నాలుగు చెక్ డ్యాంలు నిర్మించగా, ఎప్పుడూ నీరు నిల్వ ఉండి సమీపంలోని పొలాలకు నీరందించడంతోపాటు భూగర్భజలాలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకా రాయికల్ మత్తడి నీటితో మూటపెల్లి, కొత్తపేట్ గ్రామస్తులు చెరువులు నింపుకుండడంతో సంవత్సరం పొడవునా నీరు నిలిచి ఉంటూ సాగుకు భరోసా ఇస్తున్నది. ఇప్పుడు ఏడాదిలో రెండు పంటలకూ నీరందుతూ సాగు బంగారం కాగా, సమీప రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఈ ప్రాంతాన్ని దశాబ్దాల పాటు పాలించిన ఎంతో మంది పాలకులకు సాధ్యం కాని ఎన్నో పనులను సుసాధ్యం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. రాయికల్ పెద్ద చెరువును ఎస్సారెస్పీ కెనాల్తో అనుసంధానించాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా విన్నవిస్తున్నా పట్టించుకున్నవారే లేరు. మాజీ ఎంపీ ప్రత్యేక చొరవతో సమస్య పరిష్కారమైంది. రెండేళ్లుగా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. రెండు పంటలూ పండించుకుంటున్నారు. రాయికల్ పెద్ద చెరువు అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– ఎమ్మెల్యే సంజయ్కుమార్, జగిత్యాల
రాయికల్ పెద్ద చెరువును ఎస్సారెస్పీ కాలువతో అనుసంధానించాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరింది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలె. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సమస్య పరిష్కారమైంది. చెరువు ఒక్కసారి నిండితే రెండేళ్లపాటు సాగు, తాగు నీటికి ఇబ్బంది ఉండదు. అలాంటిది కెనాల్కు అనుసంధానించడంతో రాయికల్ పట్టణంతో పాటు నాలుగు గ్రామాలకు పుష్కలంగా నీరందుతున్నది.
– మోర హన్మాండ్లు, మున్సిపల్ చైర్మన్,
ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపడం సంతోషంగా ఉంది. ఈ చెరువుతో భావి తరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. భూగర్భ జలాలు పెరగడంతో పెద్ద చెరువు ఆయకట్టు కింద ఏండ్లపాటు బీడుపడ్డ భూములన్నీ సాగవుతున్నాయి. వ్యవసాయం రెట్టింపయింది. ఎస్సారెస్పీతో చెరువులను నిరంతరంగా నింపడంతో మరింత మంది వ్యవసాయం వైపు మోగ్గు చూపే అవకాశం ఉంది. ఆర్థికంగా వెసులుబాటు కలిగి రైతు రాజు కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది.
– గండ్ర రమాదేవి, రాయికల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్