దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారని ఓ ఇద్దరు వ్యక్తులను అడిగితే.. మొదటి వ్యక్తి కోటి రూపాయలు అడుగుతానన్నాడు! కానీ, తెలివైన రెండో వ్యక్తి మాత్రం కోటి రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపించమంటానని బదులిచ్చాడు. ఎందుకంటే వచ్చిన డబ్బు కొంతకాలానికి ఖర్చయిపోతుంది. అదే సంపాదించే మార్గం ఉంటే ధనం నిరంతరంగా వస్తూనే ఉంటుంది.. అంతే కాదు, పది మందికి ఉపాధి చూపవచ్చు.. అని వివరించాడు! ఇలా రెండో వ్యక్తి ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో దళితబంధు పథకం ప్రవేశపెట్టి దళితులు స్వయంగా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు, యజమానులుగా మారేందుకు, ఆర్థిక పుష్టి సాధించేందుకు శాశ్వత ఉపాధి మార్గం చూపించారు. ఈ పథకం అమలుతో వేలాది మంది ఆర్థిక స్వావలంబన సాధించి, జీవితాలను వెలుగులమయం చేసుకుంటున్నారు. ఇలా దళితబంధు మలుపుతిప్పిన కొందరి జీవితగాథలపై ప్రత్యేక కథనం..
జగిత్యాల, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సామాజిక వర్గాలుగా విభజితమైన దేశంలో దళితులు ఎప్పుడూ ముందడుగు వేయలేదు. రిజర్వేషన్ల వల్ల కూడా పూర్తిస్థాయిలో వారి జీవితాల్లో వెలుగులు రాలేదు. కొందరు కొలువులు సాధించినా, ఆర్థిక సృష్టికి, ప్రతిసృష్టి చేసే వ్యాపారవేత్తలుగా మాత్రం దళితవర్గాలు నిలువలేకపోయాయి. పెట్టుబడి దగ్గరి నుంచి అన్నింటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో దళితులకు ఆసరాగా నిలిచి, వారికి పెట్టుబడిని అందిస్తే స్వయం సాధిత వ్యాపారంలో దూసుకుపోవడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే గతేడాది ఆగస్టులో దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారు. మొదట హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసినా.. తర్వాత మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించగా, ఇప్పటి వరకు 345 కుటుంబాలు లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలు స్వయంగా వ్యాపారాలు మొదలు పెట్టి, వ్యాపారం రంగంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. దాదాపు మూడు నెలలుగా వ్యాపారంలో ఉన్న వారిని కలువగా, సీఎం కేసీఆర్ ఔనత్యాన్ని, ఆయన వల్ల తమకు కలిగిన మేలును వివరించాయి.
ఆటోవదిలి కూల్డ్రింక్స్ ఏజెన్సీ పెట్టి..
పక్క చితంలో కనిపిస్తున్నది గొల్లపల్లి మండలం శానబండ గ్రామానికి చెందిన గాదం భాస్కర్. నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తి లేదు. గుంట భూమి లేదు. ప్రైవేట్ ఫైనాన్స్లో ఆటో తీసుకుని నడుపుకుంటున్నడు. వచ్చే అరకొర పైసలతోని భార్య లావణ్య ఇద్దరు పిల్లలను సాదుకుంటున్నడు. ఆటో ద్వారా నెలకు 10 వేల నుంచి 12 వేల వరకు సంపాదించినా నెలంతా గోసపడేది. అందులో 5 వేలు ఫైనాన్సు చెల్లించడానికే పోయేది. మిగిలిన పైసలతోని కుటుంబం అతి కష్టంగా గడిచేది. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు భాస్కర్కు ఓ దారి చూపింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో పథకం కింద భాస్కర్ను ఎంపిక చేయగా, కష్టాలు దూరమయ్యాయి. వచ్చిన పది లక్షలతో గొల్లపల్లిలో కూల్ డ్రింక్స్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నడు. ఇప్పుడు నెలకు 30 వేలు సంపాదిస్తున్నడు. ఖర్చులు పోను ప్రతి నెలా 15 వేలు పొదుపు చేసుకుంటున్నాని భాస్కర్ సంతోష పడుతున్నడు. తనను గుర్తించి దళితబంధు ఇచ్చి మా కుటుంబం పాలిట సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ దేవుళ్లయ్యారని కొనియాడుతున్నడు.
నా కల నెరవేరింది
మాది జగిత్యాలలోని కృష్ణనగర్. నిరుపేద కుటుంబం. డాడీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిండు. కానీ, అక్కడ కూలి పని చేస్తుండె. పెద్దగా సంపాదన ఉండేది కాదు. నేను కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన. మొదట్లో కొన్నేండ్లపాటు జగిత్యాలలోని ఓ ట్రేడర్స్లో పనిచేసిన. వచ్చే జీతం ఎటూ సరిపోయేది కాదు. కొంత అనుభవం వచ్చింది. స్వయంగా ట్రేడర్స్ పెట్టి వ్యాపారం చేయాలని అనుకున్న. కానీ, పెట్టుబడికి పైసలు లేకుండె. చాలా చోట్ల ప్రయత్నించిన. బ్యాంకుల చుట్టూ తిరిగి. ప్రయోజనం కనిపించలె. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకంతో నా కల నెరవేరింది. దరఖాస్తు చేసుకుంటే ఎంపికైన. ప్రభుత్వం ఇచ్చిన పది లక్షలతో జగిత్యాల బైపాస్ రోడ్లో జయశ్రీ ట్రేడర్స్ పెట్టిన. యూపీసీ, సీపీవీసీ పైప్స్, విత్ ఫిట్టింగ్, వాటర్ ట్యాంక్స్, వాష్ బేసిన్లు, సిరామిక్, ప్లంబింగ్కు సంబంధించి అన్ని రకాల వస్తువులు అమ్ముతున్న. గతంలో 10వేల జీతానికి పనిచేసిన నేను ఇప్పుడు మరో వ్యక్తికి ఉపాధి చూపుతున్న. సీఎం కేసీఆర్ కృషితోనే నా జీవితం మారింది. ఓ షాపునకు ఓనరైన. నేను జీవితంలో మరిచిపోలేను. కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
– మారంపెల్లి మహేందర్, జయశ్రీ ట్రేడర్స్ యజమాని (జగిత్యాల)
నాడు ట్రాక్టర్ డ్రైవర్.. నేడు షాప్ ఓనర్
పై చిత్రంలో షాపులో కూర్చొని కనిపిస్తున్నది మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన బంగారు దీపక్. 12 ఏండ్లున్నప్పుడే తల్లిదండ్రులు భూదమ్మ, పోచయ్యను కోల్పోయిండు. తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్నడు. పదో తరగతి వరకు వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిండు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకొని ఓ యజమాని వద్ద డ్రైవర్గా జీతం ఉన్నడు. కొన్నేండ్ల క్రితం పెళ్లి చేసుకున్నడు. అయితే, తల్లిదండ్రులు, ఎలాంటి ఆస్తి లేని దీపక్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డడు. ఏదైనా వ్యాపారం చేస్తే జీవితం బాగుపడుతుందని భావించిండు. కానీ, పెట్టుబడి లేక ఏమీ చేయలేకపోయాడు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు దీపక్కు ఓ దారి చూపింది. పథకం కింద ఎంపిక కావడంతో వెంకట్రావుపేటలో మినీ సూపర్ మారెట్ పెట్టుకున్నడు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నడు. జీవితంలో షాప్ ఓనర్నయితనని అనుకోలేదని, తన జీవితమే మారిపోయిందని దీపక్ సంతోషపడుతున్నడు. సీఎం కేసీఆర్ లాగా దళితుల కోసం గొప్పగా ఆలోచించిన వ్యక్తులు లేరని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నడు. దళితబంధుకు ఎంపిక కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ వైస్చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నడు.