కలెక్టరేట్, ఆగస్టు 10 : ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వారికి వేతనం పెంపుతో పాటు వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తూ, ఉత్తర్వులు కూడా ప్రభుత్వం నుంచి విడుదల చేయించారు. కేటాయించిన శాఖల ప్రకారంగా వారు గురువారం నియామక పత్రాలు కూడా అందుకున్నారు. కాగా, కరీంనగర్లో 442 మందికి మంత్రి గంగుల కమలాకర్ తన స్వహస్తాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో అందజేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో 345 మందికి వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్ అందించారు. దీంతో, వీఆర్ఏల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పట్ల చూపిన కనికరం వల్ల ప్రభుత్వోద్యోగులుగా మారటంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ముఖ్యమంత్రిని వేనోళ్ళ పొగుడుతున్నారు. కొత్త ఉద్యోగ జీవితంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతామంటూ స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్లో 442 మందికి నియామక పత్రాలు
కరీంనగర్ జిల్లాలో గ్రామ రెవెన్యూ సహాయకులుగా కొనసాగుతూ, జీవోనెం.81 ప్రకారం అర్హులైన 442 మందికి గురువారం నియామక ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పత్రాలు అందుకున్నారు. వారి విద్యార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లుగా నియమితులయ్యారు. 155 మంది రెవెన్యూ విభాగానికి, ఇద్దరు మెడికల్ ఎడ్యుకేషన్, 71 మంది మిషన్ భగీరథ, 125 మంది జలవనరుల శాఖ, 74 మంది ఎంఏ అండ్ యూడి విభాగానికి కేటాయించగా, మరో 16 మంది ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల్లో నియమితులయ్యారు.జిల్లాకు మొత్తం 540 మందిని కేటాయించగా, ఇందులో 60 ఏళ్ళలోపు ఉన్న వారు 442 మంది ఉండగా, 107 మంది 61 ఏళ్ళు దాటినవారు ఉన్నారు. అయితే, త్వరలోనే వీరి కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అలాగే, ఇతర జిల్లాలకు కేటాయించిన వారిని కూడా సాధ్యమైనంత తొందరగా తిరిగి కరీంనగర్ జిల్లాకు రప్పించేందుకు రెవెన్యూ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో చర్చించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఆత్మగౌరవంతో బతుకుతాం
నేను డిగ్రీ అర్హతతో 2012లో వీఆర్ఏగా జాయిన్ అయినా. అప్పుడు నాకు వేతనం 3వేలే వచ్చేది. పిల్లల ఫీజుల కూడా చెల్లించలేని దుస్థితి ఉండేది. అరకొర వేతనంతో మస్తు ఇబ్బంది పడేది. రాత్రనక, పగలనకా విధులు నిర్వహించాం. ఎన్నికల సమయంలో అయితే ఎన్నో రాత్రులు డ్యూటీ చేశాం. ఇలానే ఉద్యోగ విరమణ చేస్తామనుకున్నా. కానీ, సీఎం కేసీఆర్ మా కష్టాన్ని గుర్తించి మాకు కొత్త జీవితం ప్రసాదించిన్రు. పేస్కేల్ కల్పించి, ప్రభుత్వోద్యోగులను చేసిన్రు. సీఎం కేసీఆర్ను పేదల దేవుడిగా భావిస్తున్నా. నేను, నాకుటుంబం ఆ దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటాం. పేస్కేల్ ద్వారా మా పిల్లలను మంచి చదువులు చదివించే అవకాశం లభించింది. ఇకపై ఆత్మగౌరవంతో బతుకుతాం. మా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను ఈ జన్మలో మర్చిపోలేం.
– ఎన్ స్వరూప, జూనియర్ అసిస్టెంట్ (చొప్పదండి తహసీల్ ఆఫీస్)
మా బతుకుల్లో వెలుగులు
ఇన్నాళ్లూ మాపై చిన్నచూపు ఉండేది. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నా చులకనగా చూసేది. అరకొర వేతనంతో ఇబ్బందులు పడ్డా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు భరోసా లభించింది. మా కష్టాన్ని గుర్తించి ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు కల్పించారు. మా బతుకుల్లో వెలుగులు నింపారు. ఆయన చేసిన మేలు మా కుటుంబం ఈ జన్మలో మర్చిపోదు. పేస్కేలు కల్పించి మమ్మల్ని ఆదుకున్న సీఎంకు ప్రతిగా ఏమిచ్చినా తక్కువే. పది కాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రి కొనసాగాలి. మాలాంటి పేద, బలహీన వర్గాల ప్రజలకు మరింత విస్తృతమైన సేవలందించాలి.
– పెంటి మమత, వార్డు అధికారి (కొత్తపల్లి మున్సిపాలిటీ)
నిజమైన దేవుడు కేసీఆర్
వీఆర్ఏ ఉద్యోగం నేను మా నాన్న నుంచి వారసత్వంగా పొందా. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఎదుగుబొదుగు లేకుండె. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని సుంకరులుగా పిలుస్తూ, సర్వం పనులు చేయించుకునే వారు. కొంతమంది అధికారులైతే మమ్మల్ని పూచికపుల్లతో సమానంగా చూసేవారు. అందుకే మా అందరిలో ఇదేం నౌకరీ అనే నిరాశ ఉండేది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ నిరాశ పోయింది. సీఎం కేసీఆర్ మాకు పేస్కేల్ కల్పించి వెలుగులు నింపారు. దేవుడెక్కడున్నాడో తెలియదు కానీ, ఆయనే మా కుటుంబానికి నిజమైన దేవుడు. సీఎం కేసీఆర్ పేస్కేలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంతో మేం కూడా అధికారులతో సమానంగా ఉండే స్థాయికి వచ్చాం. నేను ఒక అధికారిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ, మా కుటుంబాలకు కొత్త జీవితాలు ప్రసాదించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన మరో పది కాలాలపాటు పరిపాలన సాగించాలని కోరుకుంటున్నా.
– పాక సతీశ్, జూనియర్ అసిస్టెంట్ (హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం)
వెలుగులు నింపిన మహనీయుడు
మా పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సీఎం కేసీఆర్. 2012లో ఏపీపీఎస్సీ ద్వారా మేం రిక్రూట్ అయ్యాం. నేను నిరుపేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నాలాగ ఇవ్వాళ జిల్లాలో అనేక మంది పేస్కేల్ పొందడం గొప్పగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు పేస్కేలు రాలే. ఆనాడు వీఆర్ఏలు తీవ్ర వివక్షను ఎదుర్కొన్నరు. ఆనాడు రూ.3000 జీతం ఉండె. తర్వాత రూ.6 వేలు, రూ.10 వేలకు పెరిగింది. ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పొందే అవకాశం రావడం గొప్ప విషయం. ఇంట్లో భార్యాపిల్లలు చాలా సంతోషంగా ఉన్నరు. పేద కుటుంబాలకు చెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మల్లారం అర్జున్, వీఆర్ఏ జేఏసీ జనరల్ సెక్రటరీ, సిరిసిల్ల
వీఆర్ఏలకు పేస్కేలు దేశంలోనే మొదటిసారి
ఉమ్మడి రాష్ట్రంలో వీఆర్ఏల పరిస్థితి దారుణంగా ఉండేది. దశాబ్దాల కాలం నుంచి గ్రామ వ్యవస్థలో కీలకపాత్ర పోషించినా నాడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ, రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మాకో గుర్తింపునిచ్చారు. సుంకరులను వీఆర్ఏలుగా మార్చి, వేతనం పెంచి మా కుటుంబాలకు ఊరట కల్పించారు. అదే నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న మాకు పేస్కేలు ప్రకటించి, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడం దేశంలోనే మొదటిసారి తెలంగాణలోనే జరిగింది. నేడు కనీసం 35వేలకు తక్కువ కాకుండా వేతనం పొందే సౌకర్యం కల్పించారు. కేసీఆర్ చేసిన మేలు మాలాంటి పేద వీఆర్ఏల కుటుంబాలు ఆజన్మాంతం మర్చిపోవు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేం. మా చర్మం వొలిచి ఆయన చేతిలో పెట్టినా తక్కువే.
– కుర్రె సారయ్య, లస్కర్ (నీటిపారుదల శాఖ, కరీంనగర్)
మా కష్టానికి గుర్తింపు
ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో కింది స్థాయిలో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకువచ్చాం. మేం ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మా కుటుంబాలకు భద్రత కల్పించడం సంతోషంగా ఉంది. మేం కలలో కూడా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామనుకోలె. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మా కష్టాలు తీరినయ్. మా కుటుంబాలు ప్రభుత్వానికి రుణ పడి ఉంటయ్.
– సంతోష్, వీఆర్ఏ, సిరిసిల్ల
ఇది పేదల ప్రభుత్వం
డిగ్రీలు, పీజీలు చేసిన నేను, నాభార్య ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అయినా, కుటుంబ పోషణ కోసం అన్ని భరిస్తూ విధులు నిర్వర్తించాం. మాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకున్నది. చిరుద్యోగులపై సానుకూలంగా వ్యవహరించింది. మాకు పేస్కేల్ ఇచ్చి, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి గౌరవించింది. మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నది. మా కష్టాన్ని గుర్తించి తగిన ప్రతిఫలం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్రంలో ఆయన సమానత్వ పాలన సాగిస్తున్నాడనేందుకు మేమే నిదర్శనం. ఇతర ప్రభుత్వాలు అసాధ్యమన్న పేస్కేల్ వర్తింపు, సుసాధ్యం చేసి చూపిన మహావ్యక్తి కేసీఆర్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– రవి-చందన దంపతులు, జూనియర్ అసిస్టెంట్లు (కొత్తపల్లి తహసీల్ ఆఫీస్, కొత్తపల్లి మున్సిపాలిటీ)
పేద ఉద్యోగులకు కొత్త జీవితం
మేం ఇద్దరం వీఆర్ఏలమే. చెరొక గ్రామంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవాళ్లం. అయినా, వచ్చే అరకొర జీతం మా ఇంట్ల ఖర్చులకు సరిపోకపోయేది. పిల్లల పోషణ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జీవనం కోసం నెలతిరిగే సరికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మాకు భరోసానిచ్చారు. పేస్కేలు ఇస్తూ, మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి వెలుగులు నింపారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు కేటాయించడంతో సముచిత న్యాయం జరిగింది. మాలాంటి పేద ఉద్యోగులకు కొత్త జీవితం ప్రసాదించిన సీఎం కేసీఆరే జీవితకాలం తెలంగాణలో పాలన సాగించాలి. మాలాంటి మరిన్ని నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలి.
– నలువాల సాయికిశోర్-అనూష దంపతులు, (చొప్పదండి తహసీల్ ఆఫీస్, కొత్తపల్లి వార్డు ఆఫీసర్)