వీణవంక, మార్చి 27: పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన వివాహ వేడుకకు ఆయన ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మోటర్ వైండింగ్ చేస్తున్న శ్రీనివాస్ వద్దకు వినోద్కుమార్ వెళ్లి మాట్లాడారు. గతంలో ఎన్ని మోటర్లు కాలిపోయేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని మోటర్లు కాలుతూ రిపేర్కు వస్తున్నాయని అడిగారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ సక్రమంగా ఉండడంతో మోటర్లు బాగున్నాయని, ఇప్పుడు తరచూ కాలిపోయి రిపేర్కు వస్తున్నాయని శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కోతలకు కాలిపోయిన మోటార్ల లెక్కనే ఆరు గ్యారంటీలు ఉంటాయన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో కల్వల మాజీ సర్పంచ్ దాసారపు భద్రయ్య కూతురు వివాహం జరుగగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని ఓ హోటల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సమోసా తిని, చాయ్ తాగారు. అలాగే, మండల కేంద్రానికి చెందిన గెల్లు శ్రీనివాస్కు రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయం కాగా, వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీపీలు ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, పావని-వెంకటేశ్, మాజీ సర్పంచులు నీల కుమార్, మోరె సారయ్య, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, సింగిల్విండో డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.