ఐదు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, మళ్లీ ఆ దరిద్రం కావాలో? లేక పదేళ్లుగా స్వరాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కావాలో? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణను అభివృద్ధి చేయకుండానే, మళ్లీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారని, అలాంటి నాయకుల మాటలు నమ్మితే తెలంగాణ అంధకారం అవుతుందని సూచించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నగరంలోని 28, 29, 46 డివిజన్లలో విస్తృత ప్రచారం సాగించగా, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ప్రసంగించారు.
– కార్పొరేషన్, నవంబర్ 9
కార్పొరేషన్, నవంబర్ 9 : ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఏండ్లు సాగు, తాగునీరు, కరెంటు లేక అరిగోస పడ్డామని, మళ్లీ ఆ దరిద్రం కావాలో? ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలో? ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. గురువారం నగరంలోని 28, 29, 46 డివిజన్లలో విస్తృత ప్రచారం సాగించగా, మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతులు, డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణను అభివృద్ధి చేయకుండానే, ఇప్పుడు మళ్లీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారని మండిపడ్డారు.
అలాంటి నాయకుల మాటలు నమ్మితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారు. తెలంగాణలో చిచ్చుపెట్టి కేసీఆర్ను ఓడించి హైదరాబాద్ను ఆంధ్రాలో కలిపేసుకునేందుకు అక్కడి నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్కుమార్రెడ్డి, కేవీపీ, షర్మిల, పవన్ కల్యాణ్లు బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో హైదరాబాద్లో అడ్డా వేశారని పేర్కొన్నారు. ఇక్కడ సంపద పెరిగి.. ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ఓటు వేస్తే భవిష్యత్ తరాల నోట్లో మట్టి కొట్టినట్లే అవుతుందన్నారు. నగరాన్ని ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం నుంచి రూ.వేల కోట్ల నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. నగరంలో రోడ్లు, మురికికాల్వల అభివృద్ధితోపాటు కేబుల్బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, మెడికల్ కళాశాల, వేంకటేశ్వర దేవాలయం, ఇస్కాన్ టెంపుల్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇన్నాళ్లూ పాలించిన పాలకులు ఎందుకు నగరాన్ని అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే కేసీఆర్ చేతులను మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు నాంపెల్లి శ్రీనివాస్, వంగల శ్రీదేవి పాల్గొన్నారు.