కార్పొరేషన్, నవంబర్ 4: తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏకం అవుతున్నాయని, తెలంగాణను దోచుకునేందుకు ఎదురుచూస్తున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆదర్శంగా మారిందని, ఇప్పుడిప్పుడే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో రాష్ర్టాన్ని ఢిల్లీ చేతుల్లో పెడితే మరోసారి అరిగోస పడుతామని, తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరుపైనే అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం బీఆర్టీయూ అనుబంధ కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మంత్రి గంగుల ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని పేదంటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. అలాగే మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పులు చేసుకున్న వారికి కేసీఆర్ కిట్తో పాటుగా 12 వేలు కూడా అందిస్తున్నామని తెలిపారు.
అలాగే పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ ఓడిపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపి సంపద, నీళ్లు, కరెంటు దోచుకుపోవడానికి హైదరాబాద్లో అడ్డలు వేసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ యాభై ఏండ్ల పాలనలో తెలంగాణను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో కబ్జాకోరులు టిక్కెట్ల కోసం డబ్బుల సంచులతో పొతున్నారని, అలాంటి వారికి ఓటు వేస్తే ప్రజల భూములు మిగులుతాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. మహిళలు, కార్మికులు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక సంఘ నాయకులు రూప్సింగ్, శ్రీనివాస్రెడ్డి, ఆకుల మల్లేశం, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.