నగరాభివృద్ధే లక్ష్యం: మంత్రి గంగుల కమలాకర్
అభివృద్ధి పనులు వేగంగా చేపడుతాం: మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, ఫిబ్రవరి 9: భారీ ఎజెండాతో సమావేశమైన కరీంనగర్ బల్దియా సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. స్థానిక కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మేయర్ వై సునీల్రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్లకు పాలకవర్గ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు.
నగరాభివృద్ధే లక్ష్యం
నగరాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందరి కృషితోనే కరీంనగర్ సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్ పోటీలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. అతి త్వరలోనే నగరంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరా చేసేందుకు పనులు ప్రారంభిస్తామన్నారు. దీంతో నీటి వృథా కూడా తగ్గుతుందన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. డంప్ యార్డు సమస్య పరిష్కారానికి బయోమైనింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. రోజూ నగరంలో 150 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నదని, దీనిని క్లీనింగ్ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న డంప్యార్డును కూడా శుభ్రం చేయాల్సి ఉందన్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇప్పటికే సమీకృత మార్కెట్ పనులు ప్రారంభమయ్యాయని, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న ఇరిగేషన్ కార్యాలయంతో పాటు కశ్మీర్గడ్డ రైతుబజార్, పద్మనగర్ ప్రాంతంలో మార్కెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనికి పాలకవర్గ సభ్యులు సహకరించాలని, రోడ్లపై కూరగాయల అమ్మకాలు చేపట్టకుండా చూడాలని కోరారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపుతో పాదచారులు, ట్రాఫిక్కు ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఎంబీ బుక్కులు కనిపిస్తే సస్పెండ్ చేయాలి
నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ బుక్కులు ఇంజినీరింగ్ అధికారుల వద్దే ఉండాలని, అలా కాకుండా కాంట్రాక్టర్ల చేతుల్లో ఎందుకు కనిపిస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎంబీ బుక్కులు కాంట్రాక్టర్ల చేతుల్లో కనిపిస్తే వెంటనే సంబంధిత ఏఈని సస్పెండ్ చేయాలని కమిషనర్కు సూచించారు. అధికారులు తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సక్రమంగా పని చేస్తే అధికారులకు అండగా తాము నిలుస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగితేనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తాం
నగరంలో స్మార్ట్సిటీ, పట్టణ ప్రగతి, ఇతర గ్రాంట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని మేయర్ వై సునీల్రావు తెలిపారు. ఇప్పటికే అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. స్మార్ట్సిటీ కింద చేపట్టే అభివృద్ధి పనులను మార్చి 31లోగా టెండర్లు నిర్వహించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెలా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాలకవర్గ సభ్యులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై ప్రతి నెలా నిర్వహించే సమావేశంలో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.