కలెక్టరేట్, ఆగస్టు 19: ఉమ్మడి పాలనలో చెత్తాచెదారంతో నిండిపోయిన కరీం‘నగరం’, స్వరాష్ట్రంలో ఆరోగ్య నగరంగా భాసిల్లుతోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తెచ్చిన 11 స్వచ్ఛ ఆటోలను శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. అనంతరం మేయర్ చాంబర్లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. నిత్యం పారిశుధ్య పనులతో కరీంనగర్ రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లకు దీటుగా స్వచ్ఛతలో దూసుకెళ్తున్నదని చెప్పారు. ఎక్కడా మురుగు గుంతలు లేకపోవడంతో పందులు సంచారం, దోమల వ్యాప్తి తగ్గి పోయిందన్నారు. ఫలితంగా అంటువ్యాధుల ప్రభావం తగ్గిపోయి, నగర ప్రజలు నిత్య ఆరోగ్యవంతులుగా మారుతున్నారన్నారు. పాలకవర్గం నిరంతర కృషితో నగరంలో ఎక్కడ కూడా చెత్త కనిపించడం లేదన్నారు.
స్వచ్ఛతలో అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నట్లు వివరించారు. పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు లారీ మౌంటెడ్ సానిటేషన్ మిషన్లు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి డివిజన్కు చెత్త సేకరణ వాహనాలు కేటాయించామని, కార్మికులను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. నిత్య స్వచ్ఛత, ప్రగతి కార్యక్రమాలతో నగరం అభివృద్ధి, ఆహ్లాదకర వాతావరణానికి కేంద్రబిందువుగా మారుతున్నదని, ఇందుకు పాలకవర్గం అహర్నిశలూ కృషిచేస్తున్నదని చెపాపరు. త్వరలోనే నిరంతర నీటి సరఫరా కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరణ జరుగుతున్నదన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు యంత్ర వినియోగాన్ని పెంచామని, ఈ క్రమంలో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. స్వీపింగ్, ఫాగింగ్ యంత్రాలతోపాటు ఇతర పారిశుధ్య మిషన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఇన్చార్జి కమిషనర్గా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ బాధ్యతలు
నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ బదిలీ కాగా, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఇన్చార్జి కమిషనర్గా శనివారం సాయంత్రం కమిషనర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ను నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు. ఆయా చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.