వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రారంభ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు
ఉత్సాహంగా టీకా వేసుకుంటున్న ప్రజలు
చొప్పదండి, ఏప్రిల్ 24: 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పిలుపునిచ్చారు. రుక్మాపూర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అనవసరంగా బయటకు రాకూడదని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. మే 1నుంచి 18 ఏండ్లు నిండినవారికీ వ్యాక్సిన్ ఇస్తారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, సర్పంచ్ లింగయ్య, ఎంపీడీవో స్వరూప, మండల వైద్యాధికారి రమాదేవి పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 24: గంగాధర పీహెచ్సీ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్ను కొనసాగిసున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి సుజాత తెలిపారు. శనివారం 45 ఏండ్లు పైబడిన 166 మందికి టీకా వేసినట్లు పేర్కొన్నారు. ఉప్పరమల్యాలలో 700మందికి టీకా వేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో భాస్కర్రావు, సర్పంచులు బొల్లాడి మంజుల-శ్రీనివాస్రెడ్డి, పాశం స్వప్న-కుమార్, ఎంపీటీసీలు ముద్దం జమున-నగేశ్, ద్యావ మధుసూదన్రెడ్డి, ఏపీఎం పవన్కుమార్, దవాఖాన సిబ్బంది ఉన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 24: కరీంనగర్ మండలం చామనపల్లి ప్రాథకోన్నత పాఠశాల ఆవరణలో కొవిడ్ టీకా క్యాంపును ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రారంభించారు. కొత్తపల్లి పీహెచ్సీ డాక్టర్ శిరీష, సర్పంచ్ బొగొండ లక్ష్మి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మొగ్దుంపూర్లో సర్పంచ్ జక్కం నర్సయ్య టీకా వేసుకుని వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కొత్తపల్లి పీహెచ్సీ వైద్యుడు వంశీ మాట్లాడుతూ.. పీహెచ్సీ పరిధిలోని ఐదు సెంటర్లలో శనివారం 1655 మందికి టీకా వేసినట్లు తెలిపారు. శిబిరాలను డాక్టర్ వంశీ, బాలయ్య, ఎంపీడీవో పవన్కుమార్, ఆర్ఐ భవాని, డాక్టర్ శిరీష, పి.నర్సింహారెడ్డి పరిశీలించారు. సర్పంచులు బొగొండ లక్ష్మి, జక్కం నర్సయ్య, భూమయ్య, రాజమల్లు, ఎంపీటీసీ దామెరపల్లి పుష్ప, అంజిరెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, చంటి పాల్గొన్నారు.