రాంనగర్, మే 22 : నగరంలో లాక్డౌన్ అమలు తీరు, సడలింపు సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, మేయర్ వై సునీల్రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సడలింపు సమయాల్లో బయటకు వస్తున్న జనం, రోడ్లను ఆనుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్న వారితో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. వేంకటేశ్వరాలయం నుంచి ప్రధాన కూరగాయల మార్కెట్, గంజ్, టవర్సర్కిల్, రాజీవ్చౌక్, శనివారం మార్కెట్, రైతుబజార్, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కాలినడకన పర్యటించారు. మార్కెట్లో వ్యాపారుల వద్దకు వెళ్లి ఎన్ని రోజులకు సరిపడా కూరగాయలు తీసుకుంటున్నారు…? విక్రయాలు కొనసాగుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసిన తర్వాత మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కమాండ్ కంట్రోల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై నగరంలోని పరిస్థితులను పరిశీలించారు.
మరింత కఠినంగా అమలు: కలెక్టర్
లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. రేయింబవళ్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోలీసులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ అమలు చేస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి లక్షణాలున్నా వెంటనే దవాఖానల్లో పరీక్ష చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధి నిర్వహణ సమయంలో బయటికి రావాలని, తనిఖీల సందర్భంగా గుర్తింపుకార్డు చూపించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, అశోక్, ఏఎస్పీ రితిరాజ్, ఏసీపీలు తుల శ్రీనివాస్రావు, విజయ్కుమార్, ప్రకాశ్, రాములు, మార్కెటింగ్ అధికారి పద్మావతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కమిషనరేట్ వ్యాప్తంగా వాహన తనిఖీలు
కమిషనరేట్ వ్యాప్తంగా వాహన తనిఖీలు కొనసాగాయి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసిన తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తనిఖీలు కొనసాగుతాయని సీపీ కమలాసన్రెడ్డి తెలిపారు.