సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరింత పకడ్బందీగా అమలు
10 గంటల తర్వాత ముమ్మర తనిఖీలు
రాంనగర్, మే 22: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఉమ్మడి జిల్లాలో అధికారయంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తున్నది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తుండగా, ఆ సమయంలోనే మార్కెట్లు, షాపుల, వాణిజ్య సముదాయాల వద్ద సందడి కనిపిస్తున్నది. ఆ తర్వాత అన్నీ మూతపడుతున్నాయి. దారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియోకాన్ఫరెన్స్లో ఆదేశించడంతో అధికారయంత్రాంగం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నది. మరోవైపు 9.30గంటల నుంచే పోలీసులు రంగంలోకి దిగి, వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తిరుగుతూ, దుకాణాలు మూసివేయాలని మైకుల ద్వారా చెబుతున్నారు. పది దాటిన తర్వాత రోడ్లపై పర్యవేక్షిస్తున్నారు. శనివారం మరింత కఠినంగా అమలు చేశారు. రోడ్లపై కనిపించిన వాహనదారులను ఆపి తనిఖీలు చేసి, అనవసరం గా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.
జిల్లాలో పకడ్బందీగా..
కరీంనగర్లో ఉదయం సడలింపుల సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, నగర మేయర్ వై సునీల్రావుతో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కమాం డ్ కంట్రోల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై నగరంలో పరిస్థితులను పరిశీలించారు. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.