మొదటి దశలో 230 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి
కమాన్చౌరస్తా, జూన్ 30 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలుండగా, మొదటి దశలో 230 ప్రభుత్వ పాఠశాలల్లో 94 ఉన్నత, 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత పాఠశాలల్లో జూన్ 3 నుంచి 30 వరకు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టినట్లు చెప్పారు.
214 పాఠశాలల్లో బడ్జెట్ అంచనా రూ.30 లక్షలు దాటిన పాఠశాలలు 11, రూ.30 లక్షల లోపు 203 పాఠశాలలని, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన పాఠశాలలు 142, పనులు గ్రౌండింగ్ అయిన పాఠశాలలు145 అని తెలిపారు. పాఠశాలల్లో పనులు ప్రారంభించిన జిల్లాల్లో కరీంనగర్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో(71.08%) ఉన్నదని స్పష్టం చేశారు. మిగిలిన పాఠశాలల్లోనూ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిపోయిన పనులకు వెంటనే పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటివరకు రూ.కోటి 53 లక్షలు నిధులను పాఠశాలలకు విడుదల చేశామని చెప్పారు.