కంటి చూపు సరిగ్గా లేదనో.. ఇంకెదో సమస్య ఉందనో భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షల కోసం ఎక్కడో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన పని లేదు. కండ్లద్దాలనో.. సర్జరీలకనో వేలకు వేలు ధారపోయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ప్రతి కార్యక్రమంలోనూ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర సర్కారు, మరోసారి ‘కంటి వెలుగు’ను తెచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో రెండో విడుతను లాంఛనంగా ప్రారంభించగా, నేటి నుంచి అన్ని జిల్లాల్లో మొదలు కానున్నది. వంద రోజుల పాటు శిబిరాలు నిర్వహించి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఊరిలోనే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నది. అవసరమున్న వారికి కండ్లద్దాలు ఇవ్వడంతోపాటు శస్త్ర చికిత్సలు కూడా చేయనున్నది. ఇందుకు అన్ని చోట్లా ఏర్పాట్లు పూర్తి కాగా, ఆయాచోట్ల జిల్లాల కలెక్టర్లతోపాటు అధికారులు పరిశీలించారు. మరోవైపు ‘అమ్మా కంటి పరీక్షలు చేస్తం. మీరు రండి’ అంటూ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు.
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : నేటి నుంచి నిర్వహించే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించగా, గురువారం ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా, కరీంనగర్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమీక్షించారు. కరీంనగర్ జిల్లాలోని 313 గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన 7లక్షల 93 వేల857 మంది, పట్టణాల్లో 5,79,599 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 2,14,258 మందికి పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా నిర్ణయించామని ఇందుకు గాను 48 బృందాలు అదనంగా 2 బఫర్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకొని తమ కంటి జబ్బులను దూరం చేసుకోవాలని కలెక్టర్ కోరా రు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఎంహెచ్వో సుమన్ మోహన్ రావు కంటి వెలుగు ఏర్పాట్లపై కలెక్టరేట్లో వివరించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు 26 కంటి వెలుగు క్యాంపులలో డ్రై రన్ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని 255 గ్రామాల్లో, 67 వార్డులలో మొత్తం 322 హబీటేషన్స్లో కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు చేసేందుకు కార్యాచరణ రూపొందిచామన్నారు. జిల్లాలో 26 మంది వైద్యాధికారులు, 26 మంది ఆప్టోమెట్రిస్ట్, 26 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 26 ఆటో రిఫ్రాక్టర్ మిషన్స్, 26 వాహనాలు, క్యాంపునకు రెండు చొప్పున 52 ట్యాబ్స్ కూడా సమకూర్చామని వివరించారు. పెద్దపల్లి జిల్లాలో డ్రైరన్ నిర్వహించారు. ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో కలెక్టర్ సంగీత సత్యనారాయణ పరిశీలించారు. రాఘవాపూర్, రాగినేడు పీహెచ్సీల పరిధిలో ట్రయల్న్న్రు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. పలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్ పరిశీలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్, చర్లపల్లిలోని కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ గుగులోతు రవి పరిశీలించారు. జిల్లాలో 46 బృందాలు ఉండగా, రూరల్ ఏరియాలో 33, అర్బన్ ఏరియాలో 13 బృందాలు పని చేస్తాయని తెలిపారు.
పరీక్షలు ఇలా..
18 ఏళ్లు దాటిన శిబిరాల్లో ఎక్కడైనా పరీక్షలు చేయించుకోవచ్చు. కంటి పరీక్షలకు వచ్చే వారు తప్పకుండా ఆధార్కార్డు గానీ, రేషన్కార్డు గానీ, ఆరోగ్యశ్రీ కార్డు వెంట తెచ్చుకోవాలి. శిబిరంలో మొదటి టేబుల్ వద్ద తమ వివరాలు, చిరునామా నమోదు చేస్తారు. రెండో టేబుల్ వద్ద కళ్లకు సంబంధించి విజన్ టెస్ట్ను కుడి, ఎడమ కంటికి వేర్వేరుగా నిర్వహిస్తారు. అక్కడ కండ్లకు సంబంధించిన స్థితిని తెలుసుకొని చీటీపై విజువల్ టెస్ట్కు సంబంధించి వివరాలను నమోదు చేస్తారు. థర్డ్ టేబుల్ వద్ద మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం కంటి చూపును పరిశీలించి వాటిని ట్యాబ్లో ఎంట్రీ చేస్తారు. టేబుల్ నంబర్ 2లో విజువల్ ప్రాబ్లం ఉంటే.. టేబుల్ నంబర్ 4కు పంపుతారు. అక్కడ ఏఆర్ మెషిన్, ఆప్తోమెట్రిస్ట్ చూసి పవర్ ను బట్టి ఫొటో తీసుకొని వివరాలను అప్లోడ్ చేస్తారు. సమస్య ఉంటే కండ్లద్దాలు ఇస్తారు. ఒకవేళ కండ్లద్దాలు అందుబాటులో లేని పక్షంలో ఎంట్రీ చేసిన వివరాల ఆధారంగా ఆర్డర్ పెట్టి తెప్పించి త్వరలోనే పంపిణీ చేస్తారు. అదే సమయంలో నేత్ర వైద్యులు వారికి సంబంధించి అవసరమైన మెడిసిన్ను కూడా రాసి ఇస్తారు.
ఆహ్వాన పత్రికలు
కంటి వెలుగు రెండో విడుతను సద్వినియోగం చేసుకోవాలని సర్కారు సూచిస్తున్నది. అందులో భాగంగా విస్త్రతంగా డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. గురువారం రోజు పరీక్షలు చేసేందుకు సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో 300 మందికి ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చిత్రాలతో ఉన్న పత్రికలను అందించి పరీక్షలకు రావాలని ఆహ్వానించారు.
ఎల్లారెడ్డిపేటకు చెందిన దబ్బెడ బాల్రాజుది నిరుపేద కుటుంబం. అరవై ఏండ్లు ఉంటడు. బతుకుదెరువు కోసం ముప్పై ఏండ్ల కింద నిర్మల్ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చిండు. మొదట్లో కల్లు గీసినా.. వయసు పై బడడంతో ఇంటి వద్దే ఉంటున్నడు. కొడుకు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిండు. రెండేండ్ల కింద కండ్లు సరిగ్గా కనిపించకుంటే ఐదువందల రూపాయలు పెట్టి చూపించుకున్నడు. అప్పటి అద్దాలే వాడుతున్నడు. అవి కొద్ది రోజుల నుంచి సరిగ్గా కనిపించడం లేదు. చేతుల పైసల్లేక దవాఖానకు కూడా పోలేదు. ఎట్లయితే అట్లాయే అని అనుకున్నడు. కానీ, కంటి వెలుగు మళ్లీ మొదలైందని, ఊర్లనే ఉచితంగా పరీక్షలు చేసి కండ్లద్దాలు ఇస్తరని ఆశా చెప్పడంతో సంబురపడుతున్నడు.