రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వంద పని రోజుల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పరీక్షలు చేస్తున్నది. కాగా, ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చేస్తామన్న ధీమాతో అధికారయంత్రాంగం ముందుకు వెళ్తోంది. కాగా, ఆయా చోట్ల నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను పెద్ద సంఖ్యలో ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంత మంది వచ్చినా నేత్ర వైద్యులు, సిబ్బంది ఓపికగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అప్పటికప్పుడే మందులు, రీడింగ్ అద్దాలు పంపిణీ చేస్తున్నారు. ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమైన వారికి ఆర్డర్లు ఇచ్చి, వచ్చిన వెంటనే అందజేస్తున్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : అంధత్వ నివారణే లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం దిగ్విజయంగా అమలవుతోంది. దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి ఈ శిబిరాలు వెలుగులు నింపుతున్నాయి. యువతీ యువకుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో క్యాంపులకు వచ్చి తమ నేత్రాలను పరీక్షించుకుంటున్నారు. వంద పని రోజులు నిర్వహించాలనుకున్న ఈ కార్యక్రమం ఇప్పటికే 50 రోజులు దాటగా, మిగిలిన రోజుల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగించి లక్ష్యం పూర్తి చేస్తామని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 34 వైద్య బృందాల ద్వారా వై ద్య శిబిరాలు నిర్వహిస్తుండగా, 35 మంది వైద్యాధికారులు, 36 మంది ఆప్తోమెట్రిస్ట్లు, 34 మం ది డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నా రు. ప్రతి శిబిరంలో ఒక వైద్యాధికారి, ఆప్తమాలజిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఒక హెల్త్ సూపర్వైజర్, ముగ్గురు ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. జిల్లాలో 8,89,729 మం ది జనాభా ఉండగా, కంటి లోపాలు ఉన్నవారు 4,87,124 మంది వరకు ఉంటారని అంచనా వేసి వారందరికీ కంటి పరీక్షలను నిర్వహించాలని లక్ష్యం విధించుకున్నారు. కాగా, ఇప్పటి వరకు 2,39,488 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,22,574 మందికి కంటి లోపాలను గుర్తించి మందులను ఇచ్చారు. 53,036 రీడింగ్ , 17,317 ప్రిస్క్రిప్షన్ గ్లాసులను పంపిణీ చేశారు.
టార్గెట్ను పూర్తి చేస్తాం
పెద్దపల్లి జిల్లాలో వందకు వంద శాతం కంటి వెలుగు టార్గెట్ను పూర్తి చేస్తాం. ఇప్పటికే దాదాపుగా సగం వరకు పూర్తయ్యింది. మిగతా రోజుల్లో పూర్తి చేస్తాం. వైద్య బృందాలు, బఫర్ బృందాలతో లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.
-డా. ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో, పెద్దపల్లి
పైసా ఖర్సు లేకుంట అద్దాలచ్చినై..
నేను బోడగుట్ట కన్నాల క్వారీలో కూలీగా పనిచేస్తున్న. నా భర్త కూడా కూలీ పని చేసుకుంటడు. నా కండ్లు గుడ్డిగుడ్డిగనే కనబడుతున్నై. డాక్టర్కు సూపిచ్చుకోవాలనుకున్న కానీ, కుదరలేదు. ఇప్పుడు కంటి వెలుగు వచ్చినంక ఇక్క డ పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మిషిన్ల సూసినంక. మందులు ఇచ్చిన్రు. పైసా ఖర్సు లేకుంట అద్దాలు వచ్చినై. సీఎం సార్కు ధన్యవాదాలు.
-ఓర్సు నర్సమ్మ, జీడీ నగర్ పాలకుర్తి మండలం
మా లాంటోళ్లకు మేలు
మేం మా పని ఇడిసిపెట్టుకొని దవఖానల సుట్టూ తిరిగితే కుదరదు. ఆదివా రం పోదామంటే డాక్టర్లు ఉండరు. పైసలు గూడా బా గనే ఖర్సైతై. ఇట్ల కంటి వెలుగు శిబిరాలు పెట్టి ఊ ళ్లెకే డాక్టర్లు అచ్చి కంటి పరీక్షలు జేసుడు ఎంతో మంచిది. మాలాంటోళ్లకు ఇది చాలా మేలు. మా ఊరికి ఊరంతా అచ్చి ఈరోజు ఇక్కడ కళ్ల పరీక్షలు జే టసుకున్నరు. ఎవళ్లకూ పైసా ఖర్సు కాకుంటనే డాక్టర్లు చూసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు.
– తిరుపతమ్మ, జీడీనగర్ (పాలకుర్తి)