ధర్మారం, ఏప్రిల్ 3: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నందిమేడారం, బొట్లవనపర్తి గ్రామాల్లో పర్యటించారు. నందిమేడారం పీహెచ్సీ ఆవరణలో 5.75లక్షలతో నిర్మిస్తున్న 30పడకల దవాఖాన పనులను పరిశీలించి, మాట్లాడారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి దవాఖాన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. అనంతరం బొట్లవనపర్తిలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆ గ్రామానికి చెందిన దారవేని కొమురయ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.