చెత్తతో నిండిన రోడ్లు, అధ్వానపు వీధులు.. ఎటు చూసినా పారిశుధ్యలోపంతో కనపర్తి ఏండ్లపాటు గోస పడ్డది. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సహకారంతో ఏళ్లతరబడి వేధించిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతుండడం.. అభివృద్ధి పనులు సైతం జోరందుకోవడంతో నేడు గ్రామం ప్రగతి పథంలో సాగుతోంది. దశాబ్దాల సమస్యలు తొలగుతుండడంతో గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
– వీణవంక, మార్చి 30
కనగర్తి గ్రామం వీణవంక మండల కేంద్రానికి ఆమడ దూరంలోనే ఉంటుంది. మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్లు కూడా సరిగ్గా ఉండని పరిస్థితి. డ్రైనేజీ సరిగ్గాలేక, విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడేవారు. కానీ, స్వరాష్ట్రంలో కనగర్తి దశ మారింది. రాష్ట్ర సర్కారు భారీగా నిధులు ఇవ్వగా, వీధివీధిలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్, విద్యుత్ సౌకర్యం, నూతన జీపీ, మహిళా సంఘ భవనాల నిర్మాణంతో తొమ్మిదేండ్లలోనే గ్రామ రూపు రేఖలు మారిపోయాయి.
ఒకప్పుడు గ్రామంలో ఏ వీధికి వెళ్లినా, మరో ఊరికి వెళ్లాలన్నా మట్టి రోడ్లు, లేదంటే కంకరతేలిన రహదారులే కనిపించేవి. కానీ స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిలో భాగంగా గ్రామానికి కోట్లాది నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు కల్పించింది. గ్రామంలోని ప్రతి వీధిలో, ప్రధాన దారుల్లో రూ.1.50 కోట్లతో 56 సీసీరోడ్లు, రూ.25 లక్షలతో డ్రైనేజీలు నిర్మించారు. వీధివీధినా కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు బిగించడంతో రాత్రి వేళల్లో జిగేల్మంటున్నాయి. ఇవేగాక రూ.20 లక్షలతో గ్రామపంచాయతీకి నూతన భవనం, రూ.15 లక్షలతో మహిళా సంఘం, మరో రూ.4కోట్ల నిధులతో గ్రామంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, ప్రభుత్వ పాఠశాలకు, దేవాలయానికి ఫెన్సింగ్, మన ఊరు-మన బడి కింద పాఠశాల అభివృద్ధి, వాటర్ ట్యాంక్లు, గౌడ సంఘ భవనం నిర్మించారు.
గ్రామాన్ని ఏండ్లుగా పట్టిపీడిస్తున్న కనపర్తి-వీణవంక, కనపర్తి-బేతిగల్ గ్రామాల మధ్య బ్రిడ్జిల కల నెరవేరుతున్నది. ప్రధానంగా గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు వర్షం వచ్చిందంటే చాలు వరద తాకిడికి గండ్లు పడి రాకపోకలు బంద్ అయ్యేవి. సమీపంలోని సుమారు 50 ఇండ్లలోకి నీరు చేరేది. అటు మండల కేంద్రానికి, ఇటు జమ్మికుంటకు వెళ్లలేక వరద తగ్గే దాకా వారం, పది రోజులపాటు ఎదురుచూడాల్సిన దుస్థితి. వరద ఉధృతికి సమీపంలోని పొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వారధులు నిర్మించాలని గ్రామస్తులు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో సమస్యను ఎంపీపీ రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డి కలిసి కలెక్టర్, విప్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పరిష్కారమైంది. కనపర్తి-వీణవంక, కనపర్తి-బేతిగల్ గ్రామాల మధ్య బ్రిడ్జిల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయగా, త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఒకప్పుడు గ్రామంలో విద్యుత్ సౌకర్యం అంతంతే ఉండేది. డ్రైనేజీలు లేక మురుగు నీటి సమస్య వేధించేది. తాగునీటికీ తండ్లాటే. ఎండకాలం వచ్చిందంటే చాలు మంచినీటి కోసం బావులు అద్దెకు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ స్వరాష్ట్రంలో మా ఊరి దశ మారింది. గ్రామంలో సకల సౌకర్యాలు సమకూరాయి. ప్రజల కష్టాలు తీరిపోయాయి. నా చిన్ననాటి నుంచి వేధిస్తున్న బ్రిడ్జి సమస్య పరిష్కారమవుతోంది. నిధులు వచ్చాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రామ అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్, విప్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ఎంపీపీ రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డికి రుణపడి ఉంట.
– పర్లపెల్లి రమేశ్, సర్పంచ్(కనపర్తి )
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సహకారంతో మండలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాం. కనపర్తి, బేతిగల్ మారుమూల గ్రామాలు. బ్రిడ్జిలు లేకపోవడంతో వానాకాలం వచ్చిందంటే చాలు నీళ్లు ఊళ్లోకి వచ్చేవి. కానీ ఆ సమస్య తీరుతున్నది. ప్రభుత్వం బ్రిడ్జిల నిర్మాణానికి రూ.2కోట్లు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. విప్ కౌశిక్రెడ్డి సహకారంతో గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఆయనకు కృతజ్ఞతలు.
– ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఎంపీపీ (వీణవంక)