కాళేశ్వరం జలాలు విజయవంతంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు ఎదురెక్కుతున్నాయి. రెండు రోజులుగా లక్ష్మీబరాజ్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతుండగా, బుధవారం సాయంత్రం నాటికి జలాలు రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకున్నాయి. అక్కడి నుంచి గురువారం పంపింగ్ చేయనుండగా, ఇప్పటికే వరదకాలువ 65 కిలోమీటర్ల మేర నిండుకుండలా మారింది. కాళేశ్వరం జలాలను తీసుకెళ్లి.. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపాలన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం లక్ష్యం నేడు నెరవేరనుండగా, మొదట లబ్ధి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే దక్కనున్నది. రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అన్నీ తానే అయి అండగా నిలుస్తున్న తీరుపై యావత్ కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
– కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం ఆశలను వమ్ము చేసే పరిస్థితికి చేరుకున్నది. ఎగువన ఉన్న రాష్ర్టాలు పలు ప్రాజెక్టులు కట్టడం, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వంటి అనేక కారణాలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగాన్ని దెబ్బ తీశాయి. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లుంటే.. ఎత్తిపోయాల్సినవసరం లేకుండా ఆయకట్టు మొత్తానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఆస్కారముంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు స్టేజ్-1 స్టేజ్-2 కింద కలుపుకొని 13.55 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినా.. సమైక్య పాలనలో ఏనాడూ ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాలకు మించి ఇవ్వలేదు. వట్టిపోతున్న ప్రదాయినికి జీవం పోయాలన్న ఆలోచన కూడా నాటి పాలకులెవరూ చేయలేదు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గత పాలకులకు భిన్నంగా ఆలోచించారు. గ్రావిటీ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరందించే ఎస్పారెస్పీ ప్రాజెక్టుకు పునర్జీవం పోయాలని సంకల్పించారు. మేధోమధనం చేసి ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి అంకురార్పణ చేశారు.
నాడు భరోసా కరువే
1963 జూలై 26న ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 112 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 1970 జూలై 24న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చారు. శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద పూర్వపు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు సాగునీరివ్వాలని అప్పుడే నిర్ణయించారు. అందులో కాకతీయ కెనాల్ జీరో టూ 146 కిలోమీటర్ వరకు (ఎబో ఎల్ఎండీ) పరిధిలో 4,62,920 ఎకరాలకు, 146 నుంచి 284 కిలోమీటర్ (బిలో ఎల్ఎండీ) పరిధిలో 5,05,720 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నిర్ణయించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజీ- 2 కింద అంటే 284 నుంచి 346 కిలోమీటర్ పరిధిలో ఉన్న 3,97,949 ఎకరాలకు, మెత్తం స్టేజీ1, స్టేజీ 2 కింద కలిపి 13,55,589 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు చేశారు. కానీ, నాటి పాలనలో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఆయకట్టు రైతుకు భరోసానివ్వలేదు. ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాలకు మించి నీళ్లివ్వలేదు. రానురానూ ప్రాజెక్టు ఉనికి కోల్పోతున్నా పట్టించుకోలేదు.
స్వరాష్ట్రంలో పునర్జీవం
రైతాంగ సంక్షేమం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని ముఖ్యమంత్రి కేసీఆర్.. శ్రీరాంసాగర్ పునర్జీవ పథకాన్ని ఆచరణలో పెట్టేందుకు కూడా అదే పంథాను అనుసరించారు. 1999.56 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపన చేశారు. కాళేశ్వరంజలాలను తెచ్చి శ్రీరాంసాగర్ప్రాజెక్టు నింపుతామని ఆ రోజు జరిగిన సభలో సీఎం చెబితే, పలు ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేశారు. ‘ఇది అయ్యేదా’ అంటూ ఎగతాళి చేశారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం పథకం పనులను పరుగులు పెట్టించారు. అందుకోసం వరదకాలువ పొడవునా మూడు పంపుహౌస్లను నిర్మించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ (వరద కాలువ 73వ కిలోమీటర్) వద్ద మొదటి పంపుహౌస్, మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34 కిలోమీటర్) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ (0.10 కిలోమీటర్) వద్ద మూడో పంపుహౌస్ను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసే సామర్థ్యంతో మోటార్లు ఏర్పాటు చేయించారు. నిజానికి రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంపుహౌస్లు గతేడాదే పూర్తి కావడంతోపాటు ట్రయల్న్ కూడా విజయవంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ పంపుల ద్వారా ఎస్సారెస్సీకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలు చేరనుండగా, ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
విజయవంతంగా ఎత్తిపోతలు
పెద్దపల్లి, జూలై 5(నమస్తే తెలంగాణ)/రామడుగు/ మల్యాల/ధర్మారం/ మెట్పల్లి రూరల్, జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. లింక్-1, 2లో 18 మోటర్లు నడుస్తున్నాయి. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్లోని ఆరు పంపులను ఆన్ చేసి 13,200 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్కు తరలిస్తున్నారు. అక్కడికి చేరిన నీటిని మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంప్ హౌస్లో నాలుగు పంపులను ఆన్ చేసి 11,720 క్యూసెక్కులను మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి పంపిస్తున్నారు. ఇక అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని 4 మోటర్లను ఆన్ చేసి 10,440 క్యూసెక్కులను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలను ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపు హౌస్లోని రెండు మోటర్లను ఆన్ చేసి అండర్ టన్నెల్ ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలంలోని గాయత్రీ పంప్ హౌస్కు తరలిస్తున్నారు. అక్కడ కూడా రెం డు మోటర్లను ఆన్ చేసి 6,300 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. గ్రావిటీ కాలువ ద్వారా 5.7 కిలోమీటర్లు ప్రవహించిన కాళేశ్వరం జలాలు వరదకాలువకు చేరుకొని, అక్కడి నుంచి ఎస్సారెస్పీవైపు ఎదురెక్కుతున్నాయి. పునర్జీవ పథకంలో భాగంగా మల్యాల మండల రాంపూర్ పంపుహౌస్ నుంచి ఎత్తిపోస్తుండగా, బుధవారం సాయంత్రానికి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకున్నాయి. రాత్రి వరకు ఫోర్బే వద్ద 324.50 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకోనుండగా, ఉదయం మోటర్లతో ఎత్తిపోస్తామని డీఈ రూప్లానాయక్ తెలిపారు. నేడో, రేపో జలాలు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చేరుకుంటాయని వెల్లడించారు. మరోవైపు వరద కాలువ వెంట 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. బుధవారం నుంచే తూముల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలిస్తున్నారు.
65 కిలోమీటర్ల మేర నిండుగా వరదకాలువ
రెండురోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో సుమారు 65 కిలోమీటర్లపైగా వరదకాలువ నిండుకుండలా మారింది. వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన గేటు నుంచి 73 కిలోమీటర్వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంపుహౌస్ గేటు వరకు అర టీఎంసీ, అలాగే రాంపూర్ పంపుహౌస్ ఎత్తిపోస్తున్న నీరు 34 కిలోమీటర్ వద్ద ఏర్పాటుచేసిన రాజేశ్వర్రావు పేట పంపుహౌస్ నీరు చేరుకున్నది. దీంతో 65 కిలోమీటర్ల పొడవునా వదకాలువ నిండుకుండలా మారింది. దాదాపు ఒక టీఎంసీ నీరు ప్రస్తుతం వరదకాలువలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎత్తిపోతలు ఒకవైపు కొనసాగుతుండగా.. వరదకాలువ పరిధిలో ఉన్న పలు తూముల ద్వారా నీటిని విడుదల చేస్తూ చెరువులను నింపుతున్నారు.
నీళ్లకు రంది ఉండదు
ఒకప్పుడు మా ఊరిలోనే కాకతీయ కాలువ ఉన్నప్పటికినీ, కాలువకు కింది భాగం డిస్ట్రిబ్యూటరీల సాయంతో పంటలు పండించేవాళ్లం. మా అంతర్గాం గ్రామంలోని 80 శాతం భూములన్నీ కాకతీయ కెనాల్ కిందే ఉంటాయి. కాకతీయ కాలువ ఎగువన భూములకు చుక్క నీరు రాకపోయేది. తలాపున గోదారి మా ఊరు ఎడారి అన్నట్లు మా పరిస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ మా పక్కూరు రాంపూర్లో పంప్హౌస్ నిర్మిస్తే.. మా ఎమ్మెల్యే సంజయ్కుమార్ మా ఊరు చెరువు నింపేందుకు తూము మంజూరు చేయించిండు. మాకు ఆ తూమే ఆధారం. మళ్లీ వరద కాలువను నింపి నీళ్లు వదులుతరట. ఇక మాకు నీళ్లకు రంది ఉండదు. నాకు చానా సంబురమైంది. మా ఊరి పెద్ద చెరువుకు కాళేశ్వరం జలాలు ఇస్తరు. పంటలు పుష్కలంగా పండుతయ్.
– నక్కల రవీందర్రెడ్డి, రైతు (అంతర్గాం)