కాళేశ్వరం గంగ తరలివస్తున్నది. ఎస్సారెస్పీని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎగువకు ఎదురెక్కుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ -1, 2లో 18 మోటర్లు విజయవంతంగా నడుస్తూ జలాలను ఎత్తిపోస్తున్నాయి. లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ నుంచి ఉప్పొంగుతూ, అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువకు ఎదురెక్కుతున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా రాంపూర్ పంప్హౌస్ నుంచి మంగళవారం జలాలను ఎత్తిపోయగా, నేటి ఉదయం వరకు రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకోనున్నాయి. రెండు మూడు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుకోనుండగా, సాగునీటి రంగ చరిత్రలో మరో అధ్యాయం మొదలు కానున్నది. వట్టిపోతున్న ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలతో జీవం పోసి, లక్షలాది ఎకరాలకు నీళ్లందించాలన్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్ కల సాకారం కానున్నది.
– పెద్దపల్లి, జూలై 4 (నమస్తే తెలంగాణ)/ రామడుగు
పెద్దపల్లి, జూలై 4 (నమస్తే తెలంగాణ)/ రామడుగు : కాళేశ్వరం లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ చివరి ఆయ కట్టువరకూ వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం పంపులను నడిపిస్తున్నారు. ప్రాణహిత జలాలను కాళేశ్వరం ద్వారా ఎగువకు ఎత్తిపోస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 19,200ల క్యూసెకులు ఇన్ఫ్లో వచ్చి గోదావరిలో కలుస్తుండగా, వాటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. సోమవారం నుంచి ఎత్తిపోతలు ప్రారంభం కాగా, లింక్- 1, 2లలో 18 మోటర్లను ప్రారంభించి, నీటిని తరలిస్తున్నారు.
లింక్ -1లో 14 పంపులు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని మూడు పంప్ హౌస్ల్లో అధికారులు 14 పంపులను ఆన్ చేసి కొనసాగిస్తున్నారు. క్రమంగా 14 పంపులను నడిపిస్తున్నారు. ప్రాణహిత ద్వారా 19,200 క్యూసెక్కుల నీరు దిగువన గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుండగా, అధికారులు ఇకడి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్లో 6 పంపులను ఆన్ చేసి 13,200ల క్యూసెకుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపు హౌస్లో 4 పంపులను ఆన్చేసి 11,720ల క్యూసెకుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని నాలుగు మోటర్లను ఆన్ చేసి 10,440 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
లింక్ – 2లో నాలుగు మోటర్లు
ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్కు వెళ్తుండగా, అకడి రెండు మోటర్లను ఆన్ చేసి అండర్ టన్నెల్ ద్వారా 6300ల క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు. అకడి నుంచి టన్నెల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్కు అండర్ టన్నెళ్ల ద్వారా నీటిని తరలిస్తుండగా, అకడ రెండు మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెకుల నీటి ఎత్తి పోస్తూ అప్రోచ్ కెనాల్ ద్వారా వరదకాలువకు తరలిస్తున్నారు. ఇక్కడ మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు ఒకపంపు, ఉదయం 8 గంటల కు మరోపంపును ప్రారంభించారు. ఇక్కడి డెలివరీ సిస్టర్న్ నుం చి సుమారు 5.7 కిలోమీటర్ల దూరంలో శ్రీరాములపల్లి శివారులోని వరదకాలువ 99.02 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన జంక్షన్ పాయింట్కు చేరుకొని, వరదకాలువలో కలుస్తున్నాయి. అయితే షానగర్ శివారులో వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన హెడ్ రెగ్యులరేటర్ గేట్లను సోమవారం రాత్రి మూ సివేయడంతో జలాలు శ్రీరాజరాజేశ్వర జలాశయం వైపు వెళ్లకుండా ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతున్నాయి.
రాంపూర్ పంప్హౌస్కు చేరిన జలాలు
ఎదురెక్కుతున్న గోదావరి జలాలు సోమవారం రాత్రికే మల్యాల మండలం రాంపూర్ (వరదకాలువ 73వ కిలో మీటర్) వద్ద నిర్మించిన పంప్హౌస్కు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 7:30 గంటల నుంచి ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ఈ పంప్హౌస్లోని 8 మోటర్లలో ఒక దానిని ప్రారంభించారు. 11 గంటల ప్రాంతంలో మరో మోటర్ను, మధ్యాహ్నం 4 గంటల సమయంలో నాలుగు మోటర్లను ప్రారంభించి ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటర్ ద్వారా 1450 క్యూసెక్కుల చొప్పున మొత్తం 5,800 క్యూసెక్కుల నీటిని రాంపూర్ పంప్హౌస్ నుంచి ఎగువకు తరలిస్తున్నారు. కాగా, సాయంత్రం 7.30 గంటల సమయంలో జెన్కో ఆదేశాల నేపథ్యంలో నీటిని ఎత్తిపోసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తామని అధికారులు చెబుతున్నారు.
నేటి ఉదయానికి రాజేశ్వర్రావుపేటకు
రాంపూర్ వద్ద ఎత్తిపోసిన జలాలు బుధవారం ఉదయం 11 గంటల వరకు రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటర్) పంప్హౌస్కు చేరుతాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడికి చేరిన నీటిని పంప్హౌస్ ద్వారా ఎగువన ఉన్న నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ (0.10 కిలోమీటర్) పంప్హౌస్ వరకు తరలిస్తారు. అక్కడి నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఎత్తిపోయనున్నారు. రెండు మూడు రోజుల వ్యవధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు చేరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
చెరువులను నింపేందుకు ఏర్పాట్లు
కాళేశ్వరం జలాలతో వరద కాలువ నిండుగా మారగా, తూ ముల ద్వారా వేలాది ఎకరాలకు నీరందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వరాష్ట్రంలో వరద కాలువకు 34 తూములు ఏర్పాటు చేసి 34 చెరువులను నింపడంతోపాటు వాటికి లింకేజ్గా ఉన్న వందలాది చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తి కాకపోయినప్పటికీ రెండేండ్లుగా రాజేశ్వర్రావుపేట, రాంపూర్ పంప్హౌస్ల వరకు వరద కాలువ ద్వారా నీటిని తరలించి, వరద కాలువలో నిల్వ ఉంచుతున్న విషయం తెలిసిందే. అలాగే, వరద కాలువ ద్వారా రెండు పంప్హౌస్ల మధ్యలో ఉన్న తూముల ద్వారా చెరువులను నింపి వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఎస్సారెస్పీని కాళేశ్వరం నీటితో నింపాలని నిర్ణయించడంతోపాటు 34 తూమలు ద్వారా చెరువులను సైతం నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో అధికారులు చెరువులను నింపే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు. కాళేశ్వరం నీటిని పొలాల్లోకి తరలించేందుకు సీఎం కేసీఆర్ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి, రైతుల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సీఎం కేసీఆర్కు వరద కాలువ పరీవాహక రైతులు, ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
కాళేశ్వరం ఉండగా.. మాకెందుకు బెంగ
నాకు ఆరెకురాల భూమి ఉన్నది. నాటి ఆంధ్రోళ్ల పాలనలో నీళ్లు, కరెంటు రాక పడరాని కష్టాలు ఎల్లదీసినం. పనిలేక.. పొట్టకు ఎల్లక కుటుంబ పోషణ భారమయ్యేది. ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అమ్ముదామునుకున్న టైంల తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సార్ వచ్చినంక మొదటి సంతకం రైతుల రుణమాఫీ మీద పెట్టిండు. అప్పుడే ఆయనమీద నమ్మకమచ్చింది. తెల్లందాక, పొద్దుందాక కరెంటిచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక ఊరుపక్కనే ఉన్న మానేరు వాగు నిండా నీళ్లే వచ్చినయ్. పంటకు ఢోకాలేదు. భూమి అమ్మకుండా సాగు చేసుకుంటున్న. ఇప్పుడు వానకాలమే పేరుగానీ ఒక్కరోజు పడలేదు. అయినా, మాకు కాళేశ్వర గంగ ఉన్నది. ఎలాంటి బెంగా లేదు. కేసీఆర్ సార్ మీద నమ్మకం ఉంది. ఆయన ఉన్నంక మాకు ఢోకా లేదు. నిన్ననే కాళేశ్వరం నుంచి జలాలు విడుదల చేసిండ్రన్న వార్త చూసిన. సంతోషంగా వరినాట్లేసినం.
– కొండవేణి రవి, రైతు, గోపాల్రావుపల్లె (తంగళ్లపల్లి మండలం)
కేసీఆర్ మీద నమ్మకంతోనే సాగుచేస్తున్న
తెలంగాణ రాక ముందు ఎవుసంపై ఆశలు లేకుండె. పంటకు కావాల్సిన అన్నింటికీ గోస పడ్డం. నీళ్లు, కరెంటు కోసం పొద్దనకా.. రాత్రనకా పొలాల వద్దనే ఎల్లదీసిన రోజులు యాదికొస్తే ఏడుపొచ్చేది. మరో పనిలేక దిక్కులేక భూములను సాగుజేత్తే బాకీలైనయ్ తప్ప ఏమీ మిగలలేదు. వచ్చిన పైసలను కరెంటు బిల్లులకే పెట్టినం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ జెయ్యవట్టి పంట మొఖం చూసి మురుస్తున్నం. ఎనిమిదేళ్ల సంది పుట్ల కొద్దీ వడ్లచ్చినయ్. నాలుగు పైసలు కండ్లనిండ కనిపిస్తున్నయ్. ఎనిమిదేండ్లలో ఎన్నడూ కరువు లేదు. వానలు పడుతలేవన్న రంది లేదు. కాళేశ్వరం ఉండనే ఉంది. నీళ్లు కూడా ఇత్తమని కేసీఆర్ సార్ చెపుతుండు. పక్కనే ఉన్న మానేరులో వానలత్తెనే నీళ్లుండేవి. ఇయ్యాళ కాళేశ్వరం జెయ్యవట్టి ఏడాది పొద్దు నీళ్లుంటున్నయ్. రెండురోజులు లేటయినా పర్వాలేదనిపించింది. సార్మీద నమ్మకంతోటి భూములు సాగు చేసుకుంటున్నం.
– పర్శరాములు, రైతు, పాపయ్యపల్లె (తంగళ్లపల్లి మండలం)