దేశంలోకెల్లా రాష్ట్రంలోనే అత్యధిక బీసీ గురుకుల పాఠశాలలు
జ్యోతీరావుఫూలే జయంతి వేడుకల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్
తెలంగాణచౌక్, ఏప్రిల్ 11: మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతీరావుఫూలే అని, నేటితరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కల్టెకర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లో సోమవారం జ్యోతీరావుఫూలే 196 జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతీరావుఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి, చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, బాలికా విద్యకోసం జ్యోతీరావుఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. బాలికా విద్యకోసం జ్యోతీరావుఫూలే పాఠశాలలు ప్రారంభించడం వల్లే నేడు విద్యలో బాలికలు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు.
కొందరు తల్లిదండ్రులు అబ్బాయిలను కార్పొరేట్ స్కూళ్లకు పంపుతూ, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. దీంతో అమ్మాయిలకూ కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 200 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మహిళా విద్యా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాల్యవివాహాలు జరుగకుండా చూడాలని కోరారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, సామాజిక అసమానతలను అరికట్టడమే లక్ష్యంగా జ్యోతీరావుఫూలే చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధి, బాలికా విద్య కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతీరావుఫూలే అని కొనియాడారు. విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పారు. ఆయన ఆశయసాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్, కార్పొరేటర్లు మర్రి భావన-సతీశ్, ఐలేందర్ యాదవ్, గుగ్గిళ్ల జయశ్రీ, మాధవి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, నాయకులు ప్రకాశ్, రాకేశ్, కర్ర రాజశేఖర్, కలర్ సత్తెన్న పాల్గొన్నారు.
జ్యోతీరావుఫూలేకు ఘన నివాళి
హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 11: హుజూరాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతీరావుఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. దవాఖాన ఎదుట ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ కొలిపాక సమ్మయ్యముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టౌన్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.