మానకొండూర్, మార్చి 17: “కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి వెలగబెట్టిన బండి సంజయ్ చేసిందేంటో చెప్పు..? తెచ్చిన నిధులెన్నో చెప్పు? ఇది చేతగాకనే రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నవు..” అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఫైర్ అయ్యారు. పాదయాత్రలు ఆయనకు ఏటీఎంల లాంటివని.. వీటి పేరుతో రూ.కోట్లు దండుకుంటున్నాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం మానకొండూర్ గడిమహల్లో విలేకరులతో మాట్లాడారు. సంజయ్కి దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు, మతం పేరుతో కాకుండా చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లడగాలని సవాల్ విసిరారు. మాజీ ఎంపీ వినోద్ హయాంలోనే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.
స్మార్ట్సిటీని సాధించి రూ.వెయ్యి కోట్లు తెచ్చారని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, జ్యోతిబాఫూలే గ్రౌండ్లో సింథటిక్ ట్రాక్, టీటీడీ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, ఐటీ టవర్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్.. ఇలా అనేక ప్రాజెక్టులను సాధించిన ఘనత వినోద్కే దక్కిందన్నారు. సంజయ్.. ప్రజాహిత యాత్రలో ప్రజలు, రైతుల సమస్యలపై కాకుండా మతంపేరుతో యువకులను రెచ్చగొడుతున్నాడని ఆక్షేపించారు.
ప్రజా సమస్యలపై సీఎం రేవంత్రెడ్డిని నిలదీసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించి, అనేక ఆలయాలకు విరివిగా నిధులిచ్చిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏనాడూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయలేదన్నారు. కానీ, సంజయ్ను ప్రజలు విశ్వసించనందునే దేవుళ్ల పేరుతో ఓట్లడుగుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజలు ఆలోచించాలని.. ఒక్కసారి పొరపాటు చేస్తే ఐదేండ్లు ఆగం కావాల్సి వస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రగతి కాముకుడైన వినోద్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, మాజీ సర్పంచులు రామంచ గోపాల్రెడ్డి, దేవ సతీశ్రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, దండబోయిన శేఖర్, బోడ రాజశేఖర్, ఇస్కుల్ల అంజనేయులు, వెంకటస్వామి, పిండి సందీప్ పాల్గొన్నారు.