కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 11: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న విద్యా సంస్థలు, అందుకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నాయి.
గతంలో ఉన్నత విద్య కోసం మెట్రోపాలిటన్ సిటీలు, ఇతర నగరాలకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఇతర ప్రాంతాల విద్యార్థులు మన దగ్గరి విద్యాసంస్థల్లో చేరే స్థాయికి ఉమ్మడి జిల్లా ఎదిగింది. కేజీ నుంచి ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లోనూ అద్భుతమైన బోధన అందుతున్నది. కరీంనగర్తోపాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన అందుతుండగా, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక ఇక్కడి పాఠశాలల్లో ఆటాపాటలతో పాటు అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు విద్యార్థులకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పలు పాఠశాలల్లో అకాడమిక్ సెలబస్తో పాటు విద్యార్థులకు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అక్కడ పరిస్థితులను వివరిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్లు, దవాఖానలు, పోలీస్ స్టేషన్లు, తదితర వాటికి క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్తూ అవగాహన కల్పిస్తూ, పోటీ ప్రపంచంలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. సుధీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చేలా తయారు చేస్తున్నారు. భారీ వేదికలపై విద్యార్థులు నిర్భయంగా మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు నిర్వహించే ఎడ్యుకేషన్ఒలింపియాడ్స్, ఇతర పోటీ పరీక్షల్లోనే ఉమ్మడి జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చూపించేలా విద్యాబోధన సాగిస్తున్నారు. వీటితోపాటు విద్యార్థుల్లో శారీరక ధృడత్వంగా ఉండే విధంగా వివిధ క్రీడల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కరాటే, జూడో తదితర స్వీయరక్షణ క్రీడలతో పాటు అవుట్ డోర్, ఇండోర్ క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.