ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం అనువైన స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్వేషిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ నడుపుతూ పరిశీలించారు. మొదట రాఘవాపూర్ టీఆర్ఎస్ భవన్ సమీపంలోని స్థలంలో నిర్వహించాలని అనుకున్నా.. అది అనుకూలంగా లేకపోవడంతో పెద్దకల్వలలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న స్థలంతోపాటు ఆ చుట్టుపక్కల రహదారులను చూశారు. కాసేపు దాసరి బైక్ నడుపగా, మరికొద్ది సేపు మంత్రి రైడ్ చేశారు.
పెద్దపల్లి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సమీకృత సేవల సమాహారమే ఆధునిక కలెక్టరేట్లని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కొత్త భవనాలతో ప్రజలకు సేవలు మరింత చేరువ అవుతాయని, ఒకే చోట అన్ని రకాల పనులు పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 29న పెద్దపల్లి, వచ్చే నెల 10న జగిత్యాల కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. పెద్దపల్లిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం సభా వేదిక కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకే చోట ప్రభుత్వ సేవలను అందించడమే ధ్యేయంగా మారిన సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక పద్ధతిలో కొత్త కలెక్టరేట్లు నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత, కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెద్దకల్వల ఆటోనగర్ వెనుక వైపున గల 50 ఎకరాల స్థలంలో సభా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. సభకు పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని ఆయా మండలాల నుంచి ప్రజలు తరలివస్తారని, ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా దాదాపు లక్ష మందితో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సభాస్థలి ఏర్పాట్లను బుధవారం నుంచి ప్రారంభిస్తామని, కలెక్టర్, సీపీ, డీసీపీ, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్దీపక్, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర్, ఈఎన్సీ గణపతిరెడ్డి, డీసీపీ రూపేశ్, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, ఏసీపీ సారంగపాణి, అధికారులు ఉన్నారు.