మంథని, సెప్టెంబర్ 19: మంథనిలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం రాజేశ్ మంగళవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 100 మంది అనుచరులతో కలిసి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మంథని మండలం అడవిసోమన్పల్లికి చెందిన రాజేశ్ చాల సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చురుకైన నాయకుడు. మంథని ఎంపీటీసీగా పనిచేశారు. 2104లో కాంగ్రెస్ను వీడి చెన్నూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యాడు. ఎన్నికల తర్వాత తిరిగి కాంగ్రెస్లో చేరి శ్రీధర్బాబు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన కార్మిక సంఘం నాయకుడు భూంరెడ్డి సైతం గులాబీ పార్టీలో చేరారు.