మంథని, అక్టోబర్ 5: ‘ఎవరెన్ని చెప్పినా వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గంలో గుడిసెలు లేకుండా చేస్తా. సీఎం కేసీఆర్ సహకారంతో ఇండ్లులేని వారందరికీ గృహలక్ష్మీ పథకం కింద నిర్మిస్తా’ అని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. గత నెల 25న ఆయన ముత్తారం మండల కేంద్రంలో ప్రారంభించిన ప్రజా ఆశీర్వాద యాత్ర, 11 రోజులపాటు పాదయాత్ర చేశారు. మొత్తం తొమ్మిది మండలాల్లో 311 కిలోమీటర్లు నడిచి, గురువారం రాత్రి మంథనిలో మంథని పట్టణంలోని కళాశాల మైదానంలో ముగింపు సభ నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని, దానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నిదర్శమన్నారు.
మంథని నుంచి మనమే అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. మంథని నియోజకవర్గాన్ని ఒకే కుటుంబం 40 ఏండ్లు పాలించి ఏం చేయలేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరకుండా దిగమింగారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మంథని నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో చేసిన అవినీతి దేశంలోనే పెద్ద స్కాంగా నిలించిందన్నారు. ఇనాటి వరకు పేద ప్రజలు గుడిసెల్లోనే నివసిస్తున్నారన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించానన్నారు. ఈ తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని, పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అయితే రాజకీయంగా తనను అణగదొక్కడానికి ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నో కుట్రలు చేస్తున్నారని, తనపై అసత్య ప్రచారం చేయించేందుకు రూ.2కోట్లతో సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇలా సో షల్ మీడియాలో దుష్ప్రచారం చేసున్నవారికి ప్ర జలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ‘వచ్చే రెం డు నెలలు నా కోసం కార్యకర్తలు పనిచేస్తే, నేను మీ కోసం, ప్రజల కోసం ఐదేండ్లు పని చేస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్టశైలజ, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతం బిడ్డ పుట్ట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిని గెలిపిస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గతంలో మంత్రిగా, విప్గా ఉండి కూడా ఏమైనా చేసిండా..?. పదవి అనుభవిస్తూ, ప్రజల కష్టాలను గాలికి వదిలేసిండు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారి ఎమ్మెల్యే అయిన మధు, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్నడు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ అందించిండు. ఇలాంటి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపిచుకుంటే మన తలరాతలు మారుతయి. గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ మోసం చేస్తోంది. కర్ణాటకలో అవే హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మొండిచేయి చూపింది. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడే కాంగ్రెస్ను ఎవరూ నమ్మద్దు.
– బోర్లకుంట వెంకటేశ్, పెద్దపల్లి ఎంపీ
మన ఓటుతో గెలిచి నిత్యం హైదరాబాద్లోని ఏసీల్లో ఉండే నాయకుడు కావాలా..? లేక మన కష్టసుఖాల్లో నిత్యం అండగా ఉండే మధు అన్న కావాలో.. మంథని ప్రాంత ప్రజలు తేల్చుకోవాలి. 40 ఏండ్లు ఈ ప్రాంతాన్ని పాలించి, మంథని అంటేనే వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడేసిన నాయకుడు కావాలో..? తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి పథంలో నడిపించిన నేత కావాలో.. నిర్ణయం తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో మంథని నుంచి పుట్ట మధన్న అసెంబ్లీలో అడుగు పెడితే ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
– జక్కు శ్రీ హర్షిణి, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్