జగిత్యాల రూరల్, అక్టోబర్ 4: సీఎం కేసీఆర్ మహిళలకు మేనమామ కట్నంలా బతకమ్మ చీరలను అందిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ఆడబిడ్డలకు రూ.20 కోట్లతో నిర్మించిన డబల్ బెడ్రూం ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్గౌడ్తో కలిసి ఆయన అందజేశారు. అనంతరం గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలను, విద్యార్థులకు క్రీడా పరికరాలను అందజేశారు. అలాగే రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి, రూ. 8లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు.
కేసీఆర్ అంటే ఒక నమ్మకమని, ఆయనపై ప్రజలకు కొండంత భరోసా ఉందన్నారు. లక్ష్మీపూర్లో రూ.కోటికి పైగా నిధులతో రహదారులు నిర్మించామని గుర్తు చేశారు. ‘కంటి ముందు అభివృద్ధి.. ఇంటి ముందు అభ్యర్థి’ బీఅర్ఎస్ నినాదమని పేర్కొన్నారు. కవిత కృషితో ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఆదరణ వచ్చిందన్నారు. సీడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటుతో రైతులకు లాభమన్నారు. ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి, రాజకీయ అనుభవం కలిగిన డా.సంజయ్ కుమార్ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీతాలక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్రెడ్డి, సందీప్ రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నకల రవీందర్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, డీఈ మిలింద్, ఎంపీవో రవిబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చిన్న గంగయ్య, ఏఈ రాజమల్లయ్య, నాయకులు చంద్రారెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.