Jagityal | జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 15 : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారుచేసి తన ప్రతిభను చాటుతుంటాడు. ఈ సంవత్సరం కూడా గుండు పిన్నుపై మట్టి గణపతిని తయారు చేశాడు. ప్రతీ ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలనే ఒక సంకల్పంతో పాటు నీటి కాలుష్యం, భూమి కాలుష్యం కాకుండా కాపాడుకునాలనే బాధ్యతతో పాటు మన అందరికీ భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ మట్టి గణపతిని తయారు చేసినట్లు తెలిపాడు.
ఈ విగ్రహ తయారీకి 10గంటల సమయం పట్టినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఈయన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, దేవుళ్ల విగ్రహాలను తయారు చేసి గుండు పిన్ను మొన పైన పెట్టడంతోపాటు గుండు పిన్ను బెత్తంలో కూడా అమర్చిన సందర్భాలూ ఉన్నాయి. వీటితోపాటు బియ్యపు గింజలను చెక్కి ఎన్నో విగ్రహాలను తయారు చేసి పలువురి మన్ననలను పొందాడు.