జగిత్యాల, నవంబర్ 10: ‘ నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణీపేట, జామా మసీద్ల వద్ద ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే, 2023 మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముస్లిం మైనార్టీల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం మైనార్టీ, గురుకుల పాఠశాలలు ప్రారంభించి ఒకో విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష సాయం చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగిత్యాలలోని అన్ని మసీదులకు నిధులు కేటాయించానని, సదర్ మౌజన్లకు ప్రభుత్వం ద్వారా వేతనాలు మంజూరు చేయించానని, కబరస్థాన్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3వేల సాయం చేస్తామని, రైతు బంధు మాదిరిగానే ప్రతి పేద వారికి రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ఎల్లప్పుడు నియోజకవర్గంలోనే ఉంటూ మైనార్టీల అభివృద్ధికి పాటుపడ్డానని, అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఇక్కడ పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీశ్, మైనార్టీ పార్టీ అధ్యక్షుడు ముజ్జు, మైనార్టీ నాయకులు ఉన్నారు.