సారంగాపూర్, ఏప్రిల్ 29: ‘కాంగ్రెస్ అంటేనే నయవంచన పార్టీ. మోసపూరిత మాటలు.. ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో గద్దెనెక్కింది. ప్రజలను నిండా ముంచింది’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్రెడ్డి దేవుడి సాక్షిగా ప్రమాణ చేసి ఇచ్చిన హామీలు సైతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కొట్లాడేందుకు బీఆర్ఎస్కు ఓటువేయాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర ఫలితంగానే ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారని, పంటలకు చివరి దశలో నీరంది రైతన్నకు లభం జరిగిందన్నారు.
జగిత్యాల ఎన్నికల ఇన్చార్జి లోకబాపురెడ్డితో కలిసి సోమవారం బీర్పూర్ మండలం బీర్పూర్, తుంగూర్ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అలాగే నర్సింహులపల్లిలో ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వందరోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి చేతలెత్తేసిన రేవంత్రెడ్డి, వచ్చే ఆగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని చెబితే నమ్మేదెలా..? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, కానీ, కాంగ్రెస్ నాలుగు నెల పాలనలోనే నరకం చూస్తున్నారన్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసేవారికే ఓటు వేయాలని, అప్పుడే ఈ ప్రాంతానికి లాభం జరుగుతుందన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉంటేనే మన నిధులు, మన హక్కులు మనకు దక్కుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, మాజీ ఎంపీపీ కొల్ముల రమణ, పార్టీ అధ్యక్షులు నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రం గౌడ్, మాజీ విండో చైర్మెన్ మెరుగు రాజేశం, నాయకులు ఎడ్ల సుశిన్, బోడ సాగర్, కృష్ణ, లక్ష్మణ్, రామ్, శేఖర్ ఉన్నారు.