రాయికల్, నవంబర్ 5: ‘ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఒరగబెట్టిందేమీ లేదు. నమ్మి ఓటేసిన ప్రజలను ముంచుడు తప్ప, చేసిన మేలు ఉన్నదా..? మోసం చేయడం.. గద్దెనెక్కడం వారి నైజం. 60 ఏండ్ల నుంచి అదే జరిగింది. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు మంచిరోజులు వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమం చేరువై ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నది. ఆ పార్టీలను నమ్మితే మళ్లీ పాత కథే అవుతుంది.
ఆగమైపోతామని’ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాయికల్ మండలం అయోధ్య, ఉప్పమడుగు గ్రామాల్లో మాజీ మంత్రి రాజేశంగౌడ్తో కలిసి విస్తృత ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతు తెలిపి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడారు. పదేండ్ల కాలంలో అయోధ్య గ్రామంలో రూ.25.2 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గత పాలనలో ఈ ప్రాంతం ఎలా ఉందో.. బీఆర్ఎస్ పాలనలో ఎలా మార్పు చెందిందో చూసి ఓటేయాలని కోరారు.
అనంతరం అయోధ్య, ఉప్పుమడుగు గ్రామాలకు చెందిన 100 బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, మాజీ మంత్రిల సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ సర్పంచులు ఎడమల జీవన్ రెడ్డి, కైరి ముత్తయ్య గౌడ్, ఎంపీపీ సంధ్యారాణి, మారెట్ కమిటీ చైర్ పర్సన్ రాణి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, నాయకులు కొండల్ రెడ్డి, వినోద్ రావు, సురేష్ గౌడ్, నర్సయ్య, వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.