కథలాపూర్, నవంబర్ 29: వేములవాడ నియోజకవర్గంలో వందశాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలని వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కార్యకర్తలకు సూచించారు. గ్రామాల్లో ఓటర్లను ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలించి ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూడాలన్నారు. బుధవారం కథలాపూర్ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలకు ఎన్నికల నియామవళి, నియమ నిబంధనలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి కార్యకర్త ప్రతి ఓటరును కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు.
ఎక్కువ శాతం ఓట్లు ఉదయమే పూర్తి చేయాలని అందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించుకుని కష్టపడి పనిచేయాలన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు మార్చే ఎన్నికలని, కేవలం ఎమ్మెల్యేల కోసమే కాదని ప్రజలు గమనించి ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి, గుండారపు గంగాధర్, వర్ధినేని నాగేశ్వర్రావు, కల్లెడ శంకర్, మైస శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు.