Demand the PRC | కోరుట్ల, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాష్ట్ర కార్యదర్శి భోగ రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో బుధవారం ఫెడరేషన్ జోన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా దాని గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ ఇచ్చిన హామీలను ఆమలు చేయకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడితే గొంతెమ్మ కోర్కెలు కోరినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులను చులకన చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త పేర్లతో పాఠశాలలు ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట 27 వేల పాఠశాలలను, 4 వేలకు కుదించడం అనే అశాస్త్రీయ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తమ సర్వీస్ మొత్తంలో ఏ ఒక్క పదోన్నతి కూడా పొందకుండా పదవీ విరమణ పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును కేటాయించి ఉపాధ్యాయులకు పదోన్నతులు (Promotion) కల్పించాలని కోరారు. 2023లో మల్టీజోన్ పరిధిలో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది వివిధ జిల్లాలకు వెళ్లిన వారికి బదిలీ (Transfer) అవకాశం కల్పించాలని సూచించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోవర్ధన్, సీనియర్ నాయకులు రవికుమార్, చింతా మోహన్ ప్రసాద్, రాజ నరసయ్య , వహీదొద్దీన్, కాచర్ల నాగరాజు, చిలుక భాస్కర్, వివిధ మండలాల ప్రధాన బాధ్యులు మిట్టపల్లి రాజశేఖర్, బందరకంటి శ్రీనివాస్, చిలువేరు కృష్ణరాజన్, శ్రీనివాస్, లావుడ్య రాజయ్య, తిరుకోవెల శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.