రాజన్న సిరిసిల్ల, జూలై 17 (నమస్తే తెలంగాణ):వ్యవసాయం తర్వాత దేశంలో వెలుగు వెలిగిన టెక్స్టైల్ రంగం బీజేపీ సర్కారు పుణ్యామాని సంక్షోభంలో కూరుకుపోతున్నది. కేంద్ర సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో మూతపడే పరిస్థితికి చేరుతున్నది. ఓ వైపు రాష్ట్ర సర్కారు అనేక ప్రోత్సాహకాలతో కార్మికులకు చేతినిండా పనికల్పిస్తుండగా, కేంద్రం మాత్రం పన్నుపోటు వేస్తూ మరింత కుంగదీస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్లకు ఒక మెగా క్లస్టర్, రాష్ర్టానికి ఆరు చేనేత బ్లాక్ క్లస్టర్లు మంజూరు చేయాలని రెండేళ్లుగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తులు చేస్తున్నా మంజూరు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నది. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై నిలదీసేందుకు టీఆర్ఎస్ ఎంపీల ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో టెక్స్టైల్ పరిశ్రమ కుంటుపడి పోతున్నది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత, మరమగ్గాల పరిశ్రమకు చేయూత నివ్వాల్సింది పోయి, పన్నుల మీద పన్నులు వేస్తూ సంక్షోభంలోకి నెట్టివేసేలా చేస్తున్నది. వస్త్ర పరిశ్రమకు రాయితీలు ఇస్తూ, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర సర్కారు నేతన్నలకు అండగా నిలిచింది. సిరిసిల్లకు మెగాక్లస్టర్, రాష్ర్టానికి 6 చేనేత బ్లాక్ క్లస్టర్లు మంజూరు చే యాలని మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తులు సైతం బుట్టదాఖలు చేసింది. రేపు జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర సర్కారును నిలదీయనున్నారు.
టెక్స్టైల్ రంగానికి గడ్డుకాలం
నూలు నుంచి మొదలు, వస్త్ర ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ రూపంలో పన్ను పోటు పొడువగా, పరిశ్రమలో మాంధ్యమ పరిస్థితి ఏర్పడింది. పెరిగిన నూలు, రంగులు, రసాయనాల ధరలతో పడుతూ లేస్తున్న పరిశ్రమపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారాయి. విపణిలో పో టీని ఎదుర్కొలేక.. తయారు చేసిన వస్ర్తాలకు డిమాండ్ లేక పరిశ్రమ చతికిల పడిపోతున్నది. వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడే ప్రమాదాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లతో పరిశ్రమకు అండగా నిలిచింది. రంజాన్, క్రిస్మస్, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లిచ్చి నేతకార్మికుల బతుకులకు భరోసా నిచ్చింది. ఒకవైపు పరిశ్రమను అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న సహకారానికి కేంద్రం మొండి చేయి చూపుతుందన్న విమర్శలున్నాయి.
సిరిసిల్ల మెగాక్లస్టర్ వచ్చేనా?
సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పీకల్లోతు సంక్షోభంలోకి కూరుకు పోయింది. వందల సంఖ్యలో నేత కార్మికులు ఆకలి చావులు, ఉపాధి లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంచిరోజులొచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చూపిన చొరవతో సంక్షోభం నుంచి గట్టెక్కింది. బతుకమ్మ పండుగకు కానుకగా చీరెలను పంపిణీ చేసే పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, తయారీకి ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చారు. బతుకమ్మ చీరెలతో చేతి నిండా పని లభించింది. నెలకు రూ.20వేల పైగా కూలీ సంపాదించడంతో నేతన్నల రాత మారింది. ఇక్కడి పాతకాలపు సాంచాలను ఆధునీకరించి నాణ్యమైన వస్ర్తాలు తయారు చేయాలన్న ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం దశదిశలా చాటాలన్న సంకల్పం మేరకు ఇక్కడ మెగా క్లస్టర్, నారాయణపేట, దుబ్బాక, పోచంపల్లి, గద్వాల, కమలాపూర్, జమ్మికుంటలో చేనేత బ్లాక్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి నేరుగా వినతి పత్రాలు ఇచ్చినా ఉలుకూ పలుకూ లేదు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత, మరమగ్గాల పరిశ్రమలను ఆదుకోవాలన్న సోయి కేంద్రానికి లేకపోవడంపై నేతన్నలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించి, పరిశ్రమను కాపాడాలని కోరుతున్నారు.