జగిత్యాల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): జగిత్యాల పట్టణం పూల సింగిడిగా మారిపోయింది. తీ రొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో జగిత్యాల నేల పులకించిపోయింది. భారత జాగృతి ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్య వస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జగిత్యాల మినీస్టేడియంతో పాటు, పరిసర ప్రాంతా ల్లో జరిగిన బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది.
రెండిండ్లలో బతుకమ్మను పేర్చిన ఎమ్మెల్సీ కవిత
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జగిత్యాలకు చేరుకున్న భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్కుమార్-రాధిక దంపతులు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ స్వాగతం పలికారు. గోవిందుపల్లిలో ప్రతిష్టించిన నవదుర్గ మాత మండపాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ దంపతులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం 1.30 గంటలకు విద్యానగర్లో ఉన్న చిట్ల రమణ-సునీత దంపతుల ఇంటికి చేరుకోగా, కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు.
రమణ ఇంట్లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ సతీమణి రాధిక, ప్రముఖ సింగర్ తేలు విజయ, జాగృతి జగిత్యాల అధ్యక్షురాలు జమున, మహిళ ప్రజాప్రతినిధులు, విద్యానగర్, బట్టివాటకు చెందిన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు. బీర ఆకులు తాంబాళంలో పర్చడంతో పేర్చడం ఆరంభించిన ఎమ్మెల్సీ కవిత, ఇద్దరక్క ‘చెల్లెండ్లు ఉయ్యాలో’.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’.. ‘రామరామ శ్రీరామ’ అంటూ బతుకమ్మ పాటలు పాడుతూనే పేర్చడం పూర్తి చేశారు. తర్వాత లాంఛనంగా అక్కడే బతుకమ్మను ఉంచి స్థానిక మహిళలతో ఆడిపాడారు. తర్వాత జంబిగద్దె సమీపంలో డాక్టర్ మోర రోజ సుమన్ దంపతుల ఇంటికి చేరుకోగా, ఆ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రోజ ఇంట్లోనూ బతుకమ్మను పేర్చారు.
మార్మోగిన మినీ స్టేడియం
భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల మినీస్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. అంతకుముందు రాత్రి 7 గంటలకు బతుకమ్మల వేడుక జంబిగద్దె సమీపంలో ప్రారంభమైంది. మోర రోజ ఇంట్లో పేర్చిన బతుకమ్మతో ఎమ్మెల్సీ కవిత, పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మహిళలు బతుకమ్మలతో జంబిగద్దె వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యే సంజయ్ సతీమణి రాధిక, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, యువతులు బతుకమ్మ ఆడిపాడారు. సాయంత్రం 7 గంటలకు జంబిగద్దె వద్ద నుంచి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని శోభాయాత్రగా స్టేడియానికి చేరుకున్నారు. మినీస్టేడియంలో భారీ సైజులో రూపొందించిన బతుకమ్మలను ఉంచి పలు బృందాలుగా విడిపోయి బతుకమ్మ ఆడారు.
ఎమ్మెల్సీ కవిత, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, బతుకమ్మ ఆడుతున్న ప్రతి బృందం వద్దకు వెళ్లి వారితో కలిసి ఆడారు. ప్రముఖ నేపథ్యగాయకులు తేలు విజయ, పద్మావతి బతుకమ్మ పాటలు పాడి ఉర్రూతలూగించారు. మహిళల ఉత్సాహం చూసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం వారితో కాసేపు సరదాగా నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు మహిళలు, బతుకమ్మల ముందు తమ ఆట పాటలను ప్రదర్శించి అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా మినీస్టేడియంలో బతుకమ్మలు ఆడే మహిళల కోసం అన్ని ఏర్పాట్లను భారత జాగృతి సంస్థ ఘనంగా ఏర్పాటు చేసింది.