జగిత్యాల ఆగస్ట్ 25 : విశ్వశాంతి కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారిల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలోని నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వవ్యాప్తంగా శాంతి, ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలను కొనియాడారు.
రక్తదానం చేద్దాం విలువైన ప్రాణాలను కాపాడుదాం అన్న నినాదంతో బ్రహ్మకుమారీలు విశ్వబంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు ఉండరాదని, రక్తాన్ని ఉత్పత్తి చేయలేమని, ఆరోగ్యపరమైన ఎలాంటి అవరోధాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు బ్రహ్మకుమారీల సమాజం ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహిస్తున్నారని ఇది సమాజానికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం, తదితరులు పాల్గొన్నారు.