విద్యానగర్, డిసెంబర్ 24: కరోనా వేరియంట్ బీఎఫ్-7 వైరస్తో భయపడాల్సిన పనిలేదని, కానీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని కరీంనగర్కు చెందిన ప్రముఖ ఫీజిషియన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు పేర్కొన్నారు. శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ దేశాల్లో ఈ మధ్య కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా చైనాలో బీఎఫ్-7 అనే ఒమిక్రాన్ ఉప రూపాంతరం వల్ల ఊహకందని విధంగా నమోదవుతున్నాయని వివరించారు. ఈ వేరియంట్కు అతి త్వరగా వ్యాప్తి చెందే గుణం ఉందని, మన దేశంలో గుజరాత్, ఒడిశా రాష్ర్టాల్లో గత సెప్టెంబర్లోనే దీనిని గుర్తించారని చెప్పారు. దీని ప్రభావంతో కేసులు పెరుగవచ్చుగానీ, రోగులు సీరియస్ అయి దవాఖానలో అడ్మిట్ అయ్యే అవసరం ఉండదని, ఆక్సిజన్ అవసరం రాకపోవచ్చని చెప్పారు.
ఇది డెల్టా అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేశారు. చైనాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే గత మూడేళ్ల నుంచి జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తున్నారని, కఠిన తరమైన లాక్డౌన్లు పెట్టడం, గృహ నిర్భంధం చేయడం, ముఖ్యంగా అక్కడి ప్రజలకు కరోనా ఎక్కువగా సోకకపోవడం వంటి కారణాలతో వారికి సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తి రాలేదన్నారు. చైనాలో వినియోగిస్తున్న టీకాలు నాసిరకమైనవని, టీకాల వల్ల వచ్చే రోగ నిరోధక శక్తి చైనీయుల్లో తక్కువగా ఉందని చెప్పారు. చైనాలో 65 ఏండ్ల పైబడిన వారు చాలా మంది ఉన్నారని, వారికి టీకాలు సరిగా అందకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వివరించారు. మన దేశంలో మొదటి రెండు వేవ్ల వల్ల దాదాపు 85 శాతం ప్రజలకు కరోనా సోకిందని దాని వల్ల మనలో సహజ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరిగిందని చెప్పారు. ఇంకా సమర్థమంతమైన వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల వ్యాప్తి తగ్గిందన్నారు. దాదాపు 85 శాతం మంది ప్రజలు రెండు డోసులు టీకాలు తీసుకున్నారని, బూస్టర్ డోస్ సైతం తెలంగాణలో 48 శాతం మంది తీసుకున్నారని వివరించారు.
దీంతో టీకాల వల్ల వచ్చే వ్యాధి నిరోధక శక్తి మనలో సమృద్ధిగా ఉందన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో కేసులు పెరిగినా మరణాలు సంభవించకపోవచ్చని చెప్పారు. చైనా స్థాయి కరోనా విజృంభన మన దేశంలో ఉండదని చెప్పారు. మనం ఇదివరకే కొవిడ్ మూడ్ వేవ్లు చూశామని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమైపోయిందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్పై ఆందోళన అవసరం లేదని, కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం కొత్తగా అనుమతి ఇచ్చిన నాజిల్ వ్యాక్సిన్ను తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని, జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నవాళ్లు పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు.
రద్దీ ప్రాంతాల్లో మస్ట్గా మెయింటెన్ చేయాలని, అది కూడా సర్జికల్ మాస్క్ అయి ఉండాలన్నారు. మన దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఒక గంటలోనే పూర్తి స్థాయి సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, టెన్షన్ అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఇప్పుడు పాజిటివ్ రోగులకు సైతం హైదరాబాద్ కేంద్రంగా మందులు తయారవుతున్నాయని, అవి సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పారు.