మెట్ పల్లి రూరల్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర (Mallanna Bonala Jatara) ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 70 వేలకు పైగా బోనాలను సమర్పించారు. ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల (Potarajulu) విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లన్న స్వామి (Mallanna Swamy) రథోత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకు ముందు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) , ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడ నర్సింగరావు తదితరులు మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.