సకల హంగులతో ఆత్మగౌరవ భవనాలు ముస్తాబయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని రెండెకరాల స్థలంలో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు ఠీవీగా కొలువుదీరాయి. పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణంతో సరికొత్త శోభను సంతరించుకుని పంపిణీకి సిద్ధమయ్యాయి. నేడు అమాత్యుడు రామన్న చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయనుండగా, లబ్ధిదారుల కుటుంబాలు ఆనందంలో మునిగితేలుతున్నాయి. నయాపైసా ఖర్చు పెట్టకుండా సొంతింటి కల నెరవేరనున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
ఎల్లారెడ్డిపేట, మార్చి 4: నాలుగేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ వెంకటాపూర్ గ్రామానికి 40 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. ఈ మేరకు గ్రామ శివారులోని కరీంనగర్- కామారెడ్డి రహదారికి కూతవేటు దూరంలో రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. రూ.3కోట్ల దాకా ప్రభుత్వం నిధులు ఇవ్వగా, ఆ వెంటనే పనులు ప్రారంభించారు. పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ అనునిత్యం పర్యవేక్షించారు. అయితే కరోనా నేపథ్యంలో పనులు కాస్త ఆలసమైనా ఎట్టకేలకు 40 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, సీసీ రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. అలాగే గృహసముదాయం ఆవరణను తీరొక్క మొక్కలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇండ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసి, లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేశారు. గ్రామసభ నిర్వహించి, అర్హులను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇండ్లను కేటాయించారు. శనివారం మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనుండగా, ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రూపాయి ఖర్చు లేకుండా సొంతింటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇల్లులేక గోసెళ్లదీసినం..
ఇల్లు కట్టుకుందామంటే గుంటెడు జాగలేకుండె. కొందామంటే చేతిలో చిల్లిగవ్వ లేకుండె. మా ఆయన సాంచాలు నడిపి సంపాదించినా బట్టపొట్టకే అయితుండె. ఇల్లులేక మస్తు గోస ఎళ్లదీసినం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మంచి ఇల్లు కట్టించింది. లోపలికి వెళ్లి చూసి సంబురపడ్డం. సర్కారు ఇల్లు గింత మంచిగుంటదని కలలో గూడ అనుకోలె.
– నందాల జ్యోతి, లబ్ధిదారు (వెంకటాపూర్)
అర్హులకే ఇండ్లు కేటాయించినం..
ఇప్పటికే అనేకసార్లు జాబితాను పరిశీలించి, ఇంటింటీ సర్వే చేసి గ్రామసభలో గ్రామస్తుల సమక్షంలోనే అర్హులను ఎంపిక చేశాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాం. మొదటి దశలో 40 మందికి ఇండ్లు ఇచ్చాం. మిగిలిన 11 మందికి రెండో విడుతల ప్రాధాన్యమిస్తాం. వారు ఆందోళన చెందవద్దు. -జయంత్కుమార్, డీటీ (ఎల్లారెడ్డిపేట)