జగిత్యాల/ రాయికల్ రూరల్, ఏప్రిల్ 12: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జీ రవి అధికారులకు సూచించారు. దళిత బంధు పథకం అమలు తీరుపై కలెక్టర్ మంగళవారం జగిత్యాల రూరల్ మండలంలోని తిమ్మాపూర్, పొలాస, చల్గల్ గ్రామాల్లో, జగిత్యాల అర్బన్ మండలంలోని గాంధీనగర్, రాయికల్ మండలకేంద్రం, కుమ్మరిపల్లి, వడ్డెలింగాపూర్ గ్రామాల్లో పర్యటించి యూనిట్ల గ్రౌండింగ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడి వారి వ్యాపార ఆలోచనలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదు వినియోగం అమలు తీరుపై కలెక్టర్ స్వయంగా పరిశీలించి లబ్ధిదారులకు తగిన సూచనలు చేశారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అయిన నగదు వివరాలు తెలుపుతూ వెంటనే ఆయా యూనిట్లకు సంబంధించిన కిరాణా, సూపర్ మారెట్, మొబైల్ హోటల్, క్యాటరింగ్ సర్వీసెస్కు అవసరమైన సివిల్ పనులు, ఉడెన్ కబోర్డ్స్ మొదలైన పనులు మొదలు పెట్టాలని కలెక్టర్ సూచించారు. భవన నిర్మాణ పరికరాల సామగ్రి, మెడికల్ ఏజెన్సీ, బ్యూటీపార్లర్, ఫొటోగ్రఫీ, మెడికల్ షాప్, ల్యాబ్ వంటి యూనిట్ల గురించి లబ్ధిదారుల అనుభవాలను అడిగి తెలుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో పారిశుధ్యం, మురుగు కాల్వల పరిశుభ్రత, కూరగాయల మారెట్ పరిసరాలను పరిశీలించారు. కార్యదర్శులు పారిశుధ్యం పై శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో దళిత బంధు గ్రౌండింగ్పై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనవెంట జగిత్యాల ఆర్డీవో మాధురి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.