జగిత్యాల రూరల్/జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రతిఇంటా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. శుక్రవారం జగిత్యాల జిల్లాకేంద్రంలో పర్యటించారు. రూ. 3.32 కోట్లతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ యూనిట్ను ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, జిల్లా కలెక్టర్ జీ రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అన్నింటా ముందు నిలుస్తున్నదని చెప్పారు. జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూం ఇండ్లల్లో 4300 పూర్తయ్యాయని తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి కేసీఆర్ కాలనీగా నామకరణం చేయడంపై మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించారు.
త్వరలోనే మెడికల్ కళాశాల అందుబాటులోకి రానున్నదని చెప్పారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే జగిత్యాల డబుల్ బెడ్రూం ప్రాజెక్టు గొప్పదని, రూ. 200 కోట్లకు పైగా ఖర్చుపెట్టి 4520 ఇండ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ వ్యర్థాలను ఎరువులుగా మార్చి రైతులకు ఉచితంగా అందజేస్తామని, ఈ ప్లాంట్ 172 ఎకరాల్లో నిర్మితమైందని తెలిపారు. టీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సంప్ నుంచి కేసీఆర్ కాలనీకి నీటిని సరఫరా చేస్తామన్నారు. కేసీఆర్ నగర్ అభివృద్ధికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్, ఆర్డీవో మాధురి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.