జగిత్యాల, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటీకరణ ఆలోచనల నేపథ్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేండ్లుగా బీమా సంస్థలకు వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలోనే బీమా సంస్థలో షేర్లను పబ్లిక్ ఇష్యూలోకి తెచ్చేందుకు ప్రయత్నించడంతో ఎక్కడికక్కడ నిరసనగళం వినిపించింది. కార్పొరేట్ కంపెనీలకు విలువైన సంస్థను ధారాదత్తం చేయడమేంటన్న ప్రశ్నలు దేశ నలుమూలల నుంచి వినిపించడం, లెక్కలేనన్ని విమర్శలు రావడంతో కేంద్రం కొంత ఆలోచనలో పడిపోయింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉండి, పాలసీదారులకు ఇండియన్ సావర్నిటీ గ్యారెంటీని కలిగి ఉన్న సంస్థను ఎలా పబ్లిక్ ఇష్యూ చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఐసీలో వాటాల విక్రయం పె రుగుతూపోతే, సంస్థ క్రమంగా కార్పొరేట్ రం గాల చేతుల్లోకి వెళ్లిపోతుందని, దీంతో అనేక అనర్థాలు జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీమా సంస్థలో యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని, ప్రధానంగా బడుగు, బలహీనవర్గాలకు సంబంధించిన యువతకు కొలువులు ఇక కలగా మిగిలిపోయే ప్రమాదం కనబడుతున్నది.
ఏడు దశాబ్దాల ప్రస్థానం
1956లో మొదలైన జీవిత బీమా సంస్థ ఏడు దశాబ్దాల కాలంలో ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఎల్ఐసీ సంస్థ పురు డు పోసుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ ఇన్సూరెన్స్ చట్టాన్ని చేస్తూ, ప్రభుత్వం తరఫున 5 కోట్ల పెట్టుబడిని పెట్టడంతోపాటు సంస్థ నిర్వహించే బీమాలకు ఇండియన్ గవర్నమెంట్ సావర్నిటీ గ్యారెంటీని ఇచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా పేర్కొన్నా.. సావర్నిటీ గ్యారెంటీతో ఎల్ఐసీ సంస్థ ప్రభుత్వ బీమా సంస్థ గా పేరొందింది. అలాగే, ప్రభుత్వ నియమ నిబంధనలకనుగుణంగా మనుగడను సాగించింది. ఉద్యోగుల రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలు పెట్టి.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొలువులు కల్పించింది. బీమా సంస్థ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయడం, రాత పరీక్షలు, తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నది. ప్రస్తుతం ఎల్ఐసీలో 1,14,498 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్లాస్ వన్ ఆఫీసర్ కేటగిరీలో 32,433 మంది ఉద్యోగులుండగా, అందులో 7,202 మంది మహిళలు ఉన్నారు. ఇక క్లాస్-2 కేటగిరీలో 24,388 మంది, అందులో 1458 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. క్లాస్ 3, 4 కేటగిరీలో 57,677 మంది ఉండగా, అందులో 16,942 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడు దశాబ్దాల ప్రస్థానంలో మరో రెండు లక్షల మంది ఉద్యోగులు బీమా సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
ఉద్యోగుల్లో రిజర్వేషన్లు ఇలా..
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బీమా సంస్థ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపడుతుంది. ఎల్ఐసీలో ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం, గిరిజన తెగలకు సంబంధించి 7.5 శాతం అమలులో ఉన్నాయి. ఓ బీసీ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వబడుతున్నాయి. ఈ ప్రతి రిజర్వేషన్లోనూ మహిళలకు 33 శాతం వర్తిస్తున్నది. నిర్దేశిత రిజర్వేషన్ సంఖ్యకు అనుగుణంగానే ప్రతిసారి ఎల్ఐసీ ఉద్యోగ నోటిఫికేషన్లు వి డుదల చేస్తుంది. రెండేళ్ల క్రితం చివరిసారిగా ఎల్ఐసీ తన సంస్థలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. అప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న యూనిట్లో 55 మంది ఉద్యోగాలను భర్తీ చేసింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం పనిచేస్తున్న 1.14 లక్షల మంది ఉద్యోగుల్లో 17 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఎస్సీ రిజర్వేషన్లకు చెందిన వారు, అలాగే, గిరిజన జాతులకు చెందిన వారు 8,500కు పైగా ఉంటారని చెబుతున్నారు. ఓబీసీ వర్గాలకు సంబంధించి 30 వేల మందికి పైగా రిజర్వేషన్లలో ఉద్యోగం సంపాదించి పనిచేస్తున్నారు. గతంలో ఉద్యోగ విరమణ పొందిన వారిలో సైతం రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు లక్షకుపైగా ఉన్నారు.
ఇక కొలువులు కలగానే మిగిలేనా..?
70 ఏండ్ల ప్రస్థానంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను, ఉపాధి (ఏజెంట్లుగా)ని కల్పించిన సంస్థలో ఇక ముందు యువతకు కొలువులు కలగా మారే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి భారతీయ టెలికాం డిపార్ట్మెంట్, బీఎస్ఎన్ఎల్ సంస్థలే ఉదాహరణ అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు లక్షలాది మంది ఉద్యోగులతో కళకళలాడిన బీఎస్ఎన్ఎల్, భారతీయ టెలికాం డిపార్ట్మెంట్, అందులో వాటాలను ప్రభుత్వం విక్రయించడం మొదలు పెట్టడం, ప్రైవేట్ కంపెనీలకు ద్వారాలు తెరువడంతో, నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలే మార్కెట్లను ఆక్రమించుకొని, ప్రభుత్వ రంగ సంస్థల ఉనికిని నామమ్రాతంగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమం లో బీఎస్ఎన్ఎల్ కంపెనీలో రెండు దశాబ్దాలుగా రిక్రూట్మెంట్ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది. ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది. ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో బీఎస్ఎన్ఎల్ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వలంటరీ రిటైర్మెంట్ను ఇవ్వడం అందరికీ తెలిసిందే. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ సంస్థకు సంబంధించి వాటాలను విక్రయించడం మొదలు పెడితే.. బీఎస్ఎన్ఎల్ సంస్థలా ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించడం, మార్కెట్లను దక్కించుకునే ప్రమాదముందని, దీంతో ఎల్ఐసీ సంస్థలోనూ భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది.
రిజర్వేషన్ వర్గాలకు తీరని అన్యాయం
బీమా సంస్థ ప్రైవేట్ వర్గాల చేతుల్లోకి పోతే నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా రిజర్వేషన్ వ ర్గాలకు చెందిన బడుగు, బలహీన, గిరిజన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని నిపుణు లు పేర్కొంటున్నారు. ప్రైవేటీకరణ జరిగితే పోటీ పెరిగి ఉపాధి పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు వాదిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితులుంటాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల సం ఖ్య తగ్గిపోయి, క్రమంగా ఏజెంట్ల వ్యవస్థ పెరుగుతుందని, దీంతో రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాలు పొందేవారికి తీరని నష్టం జరుగుతుందంటున్నారు. ఇక ఏజెంట్ల రిక్రూట్మెంట్ అంతా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంటుందని, బీమా కంపెనీ వాటాలో పనిచేసే ఏజెంట్ల రిక్రూట్మెంట్లో ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ లేదని, భవిష్యత్తులోనూ ఉండదంటున్నారు. ఉద్యోగుల రిక్రూట్మెంట్ లేకపోతే ఉద్యోగాలు కలగానే మిగులుతాయని నిపుణులు చెబుతుండగా, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.